దీపావళి అంటేనే స్వీట్ల పండగని మనందరికీ తెలిసిందే. అయితే అన్నీ స్వీట్లే తయారు చేస్తే తినడానికి వెగటుగా అనిపిస్తుంది కాబట్టి, కాస్తంత వెరైటీగా, క్రిస్పీగా ఉండే పదార్థాలను కూడా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే కాయిన్ చిప్స్ చాలా క్రిస్పీగా, రుచిగా ఉండటంవల్ల చిన్నపిల్లలు అట్టే తినేస్తారు. కాబట్టి మీరూ ప్రయత్నించండి.
కావలసిన పదార్థాలు : మైదా... ముప్పావు కేజీ బియ్యంపిండి... పావుకేజీ నూనె... తగినంత వేడినీళ్లు... సరిపడా వాము... రెండు టీస్పూన్లు కరిగించిన డాల్డా... ఒక కప్పు ఉప్పు... తగినంత వంటసోడా... అర టీస్పూను మిరియాలపొడి... అర టీ స్పూను పంచదార... రెండు టీ స్పూన్లు కారం... కొద్దిగా
తయారీ విధానం : మైదాను జల్లించి, అందులో బియ్యప్పిండి, పంచదార పొడి, ఉప్పు, పసుపు, బేకింగ్పౌడర్ వేసి కలపాలి. దాంట్లోనే మిరియాల పొడి, వాము, కరిగించిన డాల్డా, తగినన్ని నీళ్లు పోసి చపాతీపిండిలా ముద్దలా చేసి, గాలి చొరకుండా గంటసేపు ఉంచాలి.
తరువాత పిండిముద్దలోంచి పిండిని తీసి, కాస్త పెద్ద పెద్ద ముద్దలుగా చేసుకుని మందపాటి పూరీల్లాగా వత్తి, రూపాయి కాసంత సైజు మూతతో బిళ్లలుగా కత్తిరించాలి. ఇలా మొత్తం పిండిని చేసుకున్న తరువాత, కాగుతున్న నూనెలో బిళ్లలను వేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే కాయిన్ చిప్స్ రెడీ అయినట్లే...! కరకరలాడుతూ రుచిగా ఉండే ఈ కాయిన్ చిప్స్ను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.