చీకటిని పారద్రోలే దీపాల పండుగ

చీకటికి వెలుగులు సాధించి, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. హిందువులే కాకుండా.. అన్ని మాతల వారు అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో దీపావళికి ప్రథమ స్థానం ఉంది. ఉత్తర భారత దేశాల్లో ఈ పండుగను అంత్యంత వైభవంగా, ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు.

ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమవాస్య రోజున దీపావళి వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు. ఇలా ప్రాశస్తిగాంచిన పండుగకు సంబంధించి ఒక పురాణకథ కూడా ఉంది. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యాసమయంలో నరకుడు అనే రాక్షసుడు జన్మించాడు.

ఈ రాక్షసుడు ప్రజలను పట్టి పీడిస్తుండేవాడు. ప్రజలను హింసకు గురిచేస్తున్న నరకుడిని అంతమొందించేందుకు సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుడు వెళతాడు. వారి మధ్య జరిగిన భీకరపోరులో శ్రీకృష్ణుడు మూర్చబోగా సత్యభామ నరకుడిని వధిస్తుంది. నరకాసురుడి పీడ విరగడైందన్న సంతోషంతో ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో.. చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు.

కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. ఈ పవిత్ర పర్వదినం రోజున ఆబాలగోపాలం కొత్త వస్త్రాలు ధరించి లక్ష్మీదేవికి పూజచేస్తారు. మట్టితో చేసిన ప్రమిదల్లో నూనె, నేతి వంటివాటిని పోసి దీపాలను వెలిగిస్తారు.

ఇంటిల్లిపాది కలిసి బాణాసంచా కాల్చుతారు. టపాకాయలు, విష్ణుచక్రాలు, తారాజువ్వలు, చిచ్చుబుడ్లు, విష్ణు చక్రాలు, భూచక్రాలు, కాకరవొత్తులు కాల్చుతుంటే కళ్లుమిరుమిట్లు గొలుపుతాయి. అలాగే.. పెద్ద శబ్దాన్ని ఇచ్చే టపాకాయలు ఢమఢమంటూ చెవులు చిల్లుల పడేలా శబ్దం చేస్తాయి.

ఈ పండుగను మంగళవారం దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకల సంబరాల్లో దేశంయావత్తు మునిగిపోయింది. దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి