దీపావళి రోజున లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలంటే!?

FILE
భారతీయ సంస్కృతికి అద్దంపట్టే దీపావళి పండుగను ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నాడు నరక చతుర్దశిగాను, అమావాస్యను దీపావళి పుణ్యదినంగాను జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ మహాలక్ష్మీ పూజ జరిపి, రాక్షసుల బాధలు తొలగిన ఆనందాన్ని వ్యక్తపరచుటకై దీపాలంకరణలు చేసి బాణసంచా కాలుస్తారు.

అలాంటి రోజున మహాలక్ష్మీ పూజ ఎందుకు చేయాలంటే..? పూర్వం దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుని ఆతిధ్యానికి సంతసించి, ఆతనికి ఓ మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదిస్తాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తనవద్దనున్న ఐరావతము అనే ఏనుగు మెడలో వేయగా.. అది ఆ హారాన్ని కాలితో తొక్కి వేస్తుంది.

దీన్ని చూసిన దుర్వాసుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్‌ఫలితంగా రాజ్యాధిపత్యం కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒ జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు.

దానికి తృప్తి చెందిన లక్ష్మీ అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొంది దుర్వాసుని పాదాలపై పడతాడు. లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి రాజ్యము, సంపదలను పొందిన దేవేంద్రుడు శ్రీ మహాలక్ష్మితో తల్లీ నీవు శ్రీహరి వద్దనే ఉండుట న్యాయమా.. నీ భక్తులను కరుణించవా? అని ప్రశ్నించాడు.

అందుకు ఆ మహాలక్ష్మీ నన్ను త్రికరణ శుద్దిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీగా, విజయాన్ని కోరే వారికి విజయలక్ష్మిగా, విద్యార్థులకు విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా.. వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మిగా ప్రసన్నురాలౌతానని చెప్పింది.

అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సమస్త సంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. కాబట్టి మనం కూడా దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని పూజించి ఆమె అనుగ్రహం పొందుదుము గాక..!.

వెబ్దునియా పై చదవండి