చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

ఠాగూర్

ఆదివారం, 15 జూన్ 2025 (17:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎంతో కీలకమని సినీ హీరో సుమన్ అన్నారు. ఆయన అనుభవం, దార్శనికత రాష్ట్రానికి ఎంతో మేలు అని ఉద్ఘాటించారు. ఆయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చంద్రబాబు తన అనుభవంతో, దార్శనికతతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలరని, ఆయన దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి అని అభిప్రాయపడ్డారు. 
 
"చంద్రబాబు ఒక విజనరీ. ఎలాంటి సంక్షోభం వచ్చినా పరిష్కరించగలిగిన సమర్థుడు చంద్రబాబు. దేశంలోనే నెంబర్ వన్ సీఎం ఎవరంటే చంద్రబాబే. దెబ్బతిన్న రాష్ట్రాన్ని చక్కదిద్దాలంటే చంద్రబాబు వల్లే సాధ్యం. అందుకు ప్రజలు కూడా సహకరించాలి. ఆయనకు కొంత సమయం ఇవ్వాలి. ఏది ముందు చెయ్యాలి, ఏది తర్వాత చెయ్యాలి అనే ప్రాధాన్యతలు ఉంటాయి. మనకు కావాల్సింది ఇపుడే జరగాలి అంటే కుదరదు. అందుకోసం వేచి చూడాల్సి" అని అన్నారు. 
 
చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. హైదరాబాద్‌ను ఆయన అభివృద్ధి చేసిన తీరు అందుకు నిదర్శనం. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ వచ్చారు. కాదనడం లేదు. కానీ హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్‌పోర్టు వంటి నిర్మాణాలతో ఒక ఆర్కిటెక్టర్ మ్యాప్‌ను ఏర్పాటుచేసింది మాత్రం చంద్రబాబే. ఇవాళ ఏపీ అభివృద్ధి అంటే ఒక పరీక్ష వంటింది. దాదాపు ఎడారి వంటి ప్రాంతాన్ని సుభిక్షంగా తయారు చేయాలంటే ఆయనకు సమయం ఇవ్వాలి. అందుకు మనమంతా సహకరించాలి అన్నారు. 
 
మనుషులు అన్న తర్వాత తప్పులు ఉంటాయి. ఎవరూ పర్ఫెక్ట్ కాదు. అయితే ఆ తప్పు పెద్దదా, చిన్నదా అనేది చూడాలి. పెద్ద తప్పు అయితే మాట్లాడాలి. చిన్న తప్పు అయితే పట్టించుకోకూడదు. గత ప్రభుత్వం తప్పులు చేయలేదా, వాళ్లు కొన్ని మంచి పనులు చేశారు. కొంత చెడు కూడా జరిగింది. మనకు మోడీగారి సహకారం ఉంది. ఆయన అండను వీలైనంతగా ఉపయోగించుకోవాలి అని సుమన్ అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు