"సత్యభామ" నరకాసురుని వధించుట

ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా పరిగణిస్తారు. పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు సాధు జనాలను పీడిస్తూ... దేవతలను హింసించే వాడు. ఇతని క్రూర చర్యలతో ముల్లోకాలను అట్టుడికిపోయాయి.

ఈ నరకాసురుడు కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు. ఈ సందర్భంలో జన్మించడం ద్వారా రాక్షసుడిగా నరకాసురుడనే పేరున పిలువబడతాడు. రాక్షసుడైన తన కుమారుడు లోకానికి ఎలాంటి కీడు కల్గినా మహావిష్ణువు వధించకూడదని, తల్లియైన తన చేతిలోనే నరకాసురుడు మరణించాలని భూదేవి వరం పొందుతుంది. ఫలితంగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది.

అప్పటికే నరకాసురుని దుశ్చర్యలు పెచ్చరిల్లిపోతుండగా, అతని అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. ఆ సమయంలో కృష్ణునికి, నరకాసురునికి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో శ్రీకృష్ణుడు నరకుని అస్త్రాలకు మూర్చిల్లుతాడు. అనంతరం భూదేవి అంశమైన సత్యభామ తన అస్త్రంతో నరకాసురుడిని వధించడం జరుగుతుంది.

ఈ విధంగా... భూదేవిగా తను పొందిన వరం సఫలీకృతం కావడంతో పాటు, తన పుత్రుడైన నరకాసురుని పేరు కలకాలం ఈ లోకంలో నిలిచి ఉండేలా చేయమని భూదేవి అంశమైన సత్యభామ కృష్ణునిని ప్రార్థిస్తుంది. ఈ ప్రార్థనకు చెవొగ్గిన శ్రీకృష్ణుడు ఆ రోజును నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరమిస్తాడు.

ఇలా నరకాసురుని వధించి అతని చెరలో బంధీలైన వేలకొలమంది రాజకన్యలను, సాధుజనులను శ్రీకృష్ణుడు విడిపించి, ధర్మాన్ని సంరక్షించాడు.

దీని ద్వారా నరకాసుర వధ జరిగిన మరుసటి రోజు... అమావాస్య చీకటిని పారద్రోలుతూ దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి పండుగ జరుపుకోవడం, అదే దీపావళి పండుగగా ప్రసిద్ది చెందడం జరిగింది.

వెబ్దునియా పై చదవండి