జీడిపప్పు, బాదం పప్పు మైసూరు పాక్ ఎలా చేయాలంటే?

శనివారం, 7 నవంబరు 2020 (17:57 IST)
Mysore pak
జీడిపప్పు పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.  అధిక కేలరీల శక్తిని అందించే జీడిపప్పు తింటే బరువు పెరుగుతారనీ, ఊబకాయం సమస్య వస్తుందని చాలా మంది అపోహ పడుతుంటారు. కానీ జీడిపప్పు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 
 
జీడిపప్పులో ప్రొటీన్లు సమృద్ధి ఉంటాయి. ఈ ప్రొటీన్‌ చాలా సులభంగా జీర్ణమవుతుంది కూడా. జీడిపప్పులోని సెలీనియం, విటమిన్‌-ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ ప్రభావాన్ని అరికట్టి క్యాన్సర్‌ ముప్పు నుంచి కాపాడుతాయి. 
 
ఇలా ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా దాగివున్న జీడిపప్పుతో మైసూర్ పాక్ తయారు చేస్తే టేస్టు అదిరిపోతుంది. ఇక జీడిపప్పు మైసూర్ పాక్‌లో బాదం పప్పుల్ని యాడ్ చేసుకుంటే  పిల్లలు ఇష్టపడి తీసుకుంటారు. 
 
జీడిపప్పు, బాదం పప్పు మైసూరు పాక్‌కు కావలసిన పదార్థాలు
నానబెట్టిన జీడిపప్పు - అరకేజీ
నానబెట్టిన బాదంపప్పు - అరకేజీ  
పంచదార - ఒకటిన్నర కేజీ 
నెయ్యి - ఒకటిన్నర కప్పు
యాలకులు - ఆరు 
 
తయారీ విధానం: 
ముందుగా పచ్చి జీడిపప్పు, బాదం పప్పును రెండు గంటలు నీటిలో నానబెట్టుకుని, శుభ్రం చేయాలి. శుభ్రం చేసిన జీడిపప్పును మిక్సీలో వేసి గారెల పిండి వలె ముద్దగా చేసుకోవాలి. ఆపై బాణీలో పంచదార పాకం పట్టాలి. 
 
తీగపాకం వచ్చిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు ముద్దను అందులో కలిపి, బాగా కలియబెట్టాలి. కొంచెం ఉడికించాక అందులో నెయ్యి వేసి బాగా కలుపుతూ మరింత ఉడికించాలి. తర్వాత యాలకుల పొడిని వేసి మైసూర్ పాక్ పాకం వచ్చాక దించేయాలి. తర్వాత ఓ ప్లేటులో నెయ్యి రాసి ఆ పాకాన్ని అందులో పోయాలి. 
 
కొంచెం సేపు తర్వాత ముక్కలుగా కోసి డబ్బాలో వేసుకోవాలి. ఈ మైసూరు పాకం తినడానికి చాలా రుచిగా ఉండటంతో పాటూ చాలా బలాన్ని, ఆరోగ్యాన్ని చేకూరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు