వెన్నుపోటు బాబు... ఎన్నికలొచ్చినపుడే ఎన్టీఆర్ కు దండ వేస్తాడు... జగన్

మంగళవారం, 25 మార్చి 2014 (20:27 IST)
WD
పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ఎన్నికలు వచ్చినపుడల్లా ఎన్టీఆర్ ఫోటో తీసి దండ వేయడం అలవాటుగా ఉందని జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నం రోడ్ షోలో కిక్కిరిసిన కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు నాయుడిని విమర్శనాస్త్రాలతో తూర్పారబట్టారు.

ఆచరణ సాధ్యం కాని హామీలను చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్నారనీ, సీమాంధ్రను సింగపూర్ చేస్తానని అంటున్నారనీ, అలా చెప్పే బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజన చేస్తుంటే ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు వైఖరి చూస్తుంటే ఒక వ్యక్తిని కత్తితో పొడిచి చంపేసి, చనిపోయిన వ్యక్తికి నేనే ముందు దండ వేస్తానంటూ పరుగు పెట్టినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

2014 ఎన్నికలు ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉండదనీ, అందువల్లనే ఆచరణ సాధ్యం కాని ఎన్నో హామీలను ఇస్తూ ప్రజలను మోసం చేసేందుకు చూస్తున్నారని అన్నారు. కనుక మరో 45 రోజుల్లో మన తలరాతలను మార్చే ఎన్నికల్లో ఆలోచన చేసి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సొంత కూతురును ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలను మోసం చేయడం లెక్క కాదని జగన్ విమర్శించారు.

వెబ్దునియా పై చదవండి