ముంబై దాడులకు బీమా ఐదు వందల కోట్లు

శనివారం, 9 జనవరి 2010 (12:42 IST)
ముంబైలో ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా నష్టపోయిన సంస్థలకు బీమా కంపెనీలు భారీ స్థాయిలో క్లెయిములు చెల్లించాల్సి వస్తోంది. ఈ చెల్లింపులు దాదాపు రూ. 500 కోట్ల మేరకు ఉండవచ్చని బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ(ఐఆర్‌డీఏ) వెల్లడించింది.

2008 నవంబర్ నెలలో ముంబైలో ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా నష్టపోయిన సంస్థలు, మృతి చెందిన వారికి పరిహారం కింద దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలను చెల్లించాల్సివుందని ఐఆర్‌డీఏ సంస్థ తెలిపింది. ఇంత పెద్ద మొత్తాన్ని బీమా సంస్థలు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక నిధి టెర్రర్ పూల్ నుంచి చెల్లించనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.

2002లో టెర్రర్ పూల్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు ఐఆర్‌డీఏ తెలిపింది. అప్పటి నుంచి అధిక మొత్తంలో చెల్లింపులు చెల్లించాల్సి రావడం ఇదే మొదటి సారని ఆ సంస్థ తెలిపింది. ఇప్పటికే పలు బీమా కంపెనీలు బాధితులకు రూ. 50 కోట్లు చెల్లించిందని ఐఆర్‌డీఏ వివరించింది.

ఇదిలావుండగా గతంలో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో దేశంలోని పలు బీమా సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి ఉగ్రవాద ప్రీమియం(టెర్రరిజం ప్రీమియం) రేట్లు గణనీయంగా పెంచాయి. 2008-09 ఆర్థిక సంవత్సరంలో 222.55 కోట్ల రూపాయల ప్రీమియం వసూలు కాగా క్లెయిమ్ చెల్లింపులు రూ. 50 కోట్ల మేరకు జరిగాయి.

వెబ్దునియా పై చదవండి