చార్జీల విధింపు తప్పా రైటా తర్వాతి విషయం.. బాదటం మాత్రం ఖాయమే అంటున్న బ్యాంకు మారాజులు

మంగళవారం, 7 మార్చి 2017 (03:48 IST)
మేం చేసే పని తప్పో ఒప్పో దాన్ని తేల్చాల్సింది మీరూ మేమూ కాదు. చార్జీల బాదుడు మాత్రం ఖాయమే అంటున్నాయి మన దిగ్గజ బ్యాంకులు. దేశీయ బ్యాంకింగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఖాతాదారుల పుట్టి ముంచడానికి బ్యాంకు దిగ్గజాలుగా పేరున్న ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకులు సిద్ధమయ్యాయి. ఆ బాదుడు ముద్దుపేరు కస్టమర్లపై ఛార్జీలు. నిర్దేశించిన మొత్తం కంటే నగదు లావాదేవీలు జరిపితే, ఇక యూజర్లు తప్పసరిగా ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చాయి. నగదు లావాదేవీల తగ్గింపునకు కస్టమర్లకు ఈ వడ్డింపు వేస్తున్నట్టు  బ్యాంకులు పేర్కొంటున్నాయి.
ఏప్రిల్ 1 నుంచి మీరు ఏదైనా పనిమీద బ్యాంకుకు వెళ్లేముందు ఏ బ్యాంకిలో మీరు చేయిపెడితే ఎలా కరుస్తుందో, ఏ పని చేస్తే మీ దూల తీరుతుందో లేక తీరదో ఒకటికి రెండు సార్లు కింది అంశాలను సరిచూసుకుని మరీ వెళ్లండి. తెలిసి లేక తెలియక ఏ చిన్న పొరపాటు చేసినా, అజాగ్రత్తగా ఉన్నా చార్జీల పేరుతో మా ఖాతాలో డబ్బు కరిగిపోవటం ఖాయం. 
 
బ్యాంకులు భారీగా విధించే సమీక్షించిన ఛార్జీల వివరాలేంటో మీరే ఓ సారి చూడండి....
 
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా
1. ఏప్రిల్ 1 నుంచి సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు నెలకు మూడు సార్లు మాత్రమే ఉచిత ఛార్జీతో నగదు డిపాజిట్ చేయొచ్చు. అంతకుమించితే, ప్రతి లావాదేవీకి రూ.50కు మించి సర్వీసు ట్యాక్స్ చెల్లించాలి. 
2. రూ.10,000 నెలవారీ సగటు నిల్వ (ఎంఏబీ) ఉండే సాధారణ కరెంటు ఖాతాదారులు బ్యాంకులో రోజుకు రూ.25,000 వరకు నగదును ఉచితంగా డిపాజిట్‌ చేసుకోవచ్చు. అంతకు మించి నగదు డిపాజిట్‌ చేయాలనుకుంటే ప్రతీ రూ.1,000పై 75పైసల చార్జీ+సర్వీసు ట్యాక్స్ విధింపు ఉంటుంది.
3.  ఏప్రిల్‌ 1 నుంచి కనీస బ్యాలన్స్‌ లేని ఖాతాలపై జరిమానా విధింపు. నెలవారీ కనీస నగదు నిల్వ నిర్వహణలో విఫలమైతే సేవింగ్స్‌ ఖాతాదారులకు గరిష్టంగా రూ.100 పెనాల్టీ తోపాటు సర్వీసు ట్యాక్స్ విధిస్తారు. కనిష్టంగా రూ.20+సర్వీసు ట్యాక్స్ ను బ్యాంకు నిర్ణయించింది. 
4. మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో కనీస నగదు నిల్వ రూ.5000కు 75 శాతానికి పైగా తగ్గితే రూ.100 ప్లస్ సర్వీసు ట్యాక్స్ ఉంటుంది.  ఒకవేళ 50 శాతం తగ్గితే, రూ.50 ప్లస్ సర్వీసు ట్యాక్స్ విధిస్తారు. 
5. ఇతర బ్యాంకు ఏటీఎంలలో విత్ డ్రా లిమిట్ మూడు సార్లు కంటే ఎక్కువ సార్లు చేస్తే రూ.20 ఛార్జీ వేస్తుంది. ఎస్బీఐ ఏటీఎంలలోనే ఐదు సార్లు కంటే ఎక్కువ సార్లు డ్రా చేస్తే రూ.10 ఛార్జీని బ్యాంకు విధించనుంది.
6. రూ.25వేల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉండే సొంత ఏటీఎంలలో అయితే ఎలాంటి విత్ డ్రా ఛార్జీలుండవు.  ఇతర బ్యాంకు ఏటీఎంలలో డ్రా చేసుకునేందుకు ఛార్జీల మోత నుంచి తప్పించుకోవాలంటే బ్యాంకు బ్యాలెన్స్ రూ.లక్షకు మించి ఉండాలి. 
7.ఓ త్రైమాసిక కాలంలో కనీస నగదు నిల్వలు రూ.25 వేలలోపు నిర్వహించే ఖాతాదారులకు వారి డెబిట్‌ కార్డు లావాదేవీలపై ఎస్‌ఎంఎస్‌ అలర్ట్స్‌కు గాను బ్యాంకు రూ.15 చార్జీలు వసూలు చేస్తుంది. పీఐయూఎస్‌ఎస్‌డీ లావాదేవీల విలువ రూ.1,000 వరకు ఉంటే ఆ సేవలు ఉచితం. 
 
హెచ్డీఎఫ్సీ 
1. ప్రతినెలా నాలుగు ఉచిత లావాదేవీలు(డిపాజిట్లు, విత్ డ్రాలు కలిపి) చేసుకున్న అనంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రతి లావాదేవీకి రూ.150 లెవీ వేస్తుంది.
2. ఈ కొత్త ఛార్జీలు సేవింగ్స్, శాలరీ అకౌంట్లకు వర్తిస్తాయి.
3. హోమ్-బ్రాంచు లావాదేవీలకు, ఒక్కరోజు ఒకేసారి రూ.2 లక్షల వరకు ఉచితంగా డిపాజిట్ లేదా విత్ డ్రా చేసుకునే అవకాశముంటుంది. అంతకు మించితే ఇక ప్రతి రూ.1000కు రూ.5 లేదా రూ.150 చెల్లించాలి.
4. నాన్-హోమ్ బ్రాంచులో  ఒక్కరోజులో రూ.25వేలకు మించి లావాదేవీ జరిపితే, ప్రతి రూ.1000కి రూ.5 లేదా రూ.150 ఛార్జీ విధిస్తారు. 
 
ఐసీఐసీఐ బ్యాంకు   
1. హోమ్ సిటీలోని శాఖల వద్ద నెలకు నాలుగు లావాదేవీలకు బ్యాంకు ఎలాంటి ఛార్జీలు విధించదు.  ఆ పరిమితికి మించితే విత్ డ్రా లేదా డిపాజిట్ల  ఒక్కో లావాదేవీపై కనీస ఛార్జీగా రూ.150 వసూలు చేస్తుంది.
2. థర్డ్ పార్టీ లిమిట్ రోజుకు రూ.50వేలే.
3. నాన్-హోమ్ బ్రాంచుల్లో ఐసీఐసీఐ బ్యాంకు తొలి క్యాష్ విత్ డ్రాకు క్యాలెండర్ నెలలో ఎలాంటి ఛార్జీ వేయదు. అంతకు మించితే కనీస ఛార్జీ రూ.150.
4. ఎక్కడైనా నగదు డిపాజిట్లకు ఐసీఐసీఐ బ్యాంకు ప్రతి రూ.1000కు రూ.5 ఛార్జీ వేస్తోంది. అంటే కనీసం రూ.150 వరకు ఉంటుంది. క్యాలెండర్ నెలలో తొలి క్యాష్‌ డిపాజిట్  ఉచితం. తర్వాత దానికి రూ.1000కు రూ.5 ఛార్జీ  ఉంటుంది. 
 
యాక్సిస్ బ్యాంకు  
1. యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులు ప్రతి నెల ఉచితంగా ఐదు లావాదేవీలు జరుపుకోవచ్చు. ఆ ఐదు లావాదేవీల్లోనే డిపాజిట్లు, విత్ డ్రాలు ఉంటాయి. అంతకుమించితే ప్రతి లావాదేవీకి రూ.95 కనీస ఛార్జీ ఉంటుంది.
2.  గరిష్టంగా రూ.50వేలు డిపాజిట్ చేసే  కస్టమర్లకు ఐదు నాన్-హోమ్ బ్రాంచు లావాదేవీలు ఉచితం. అదే ఎక్కువ మొత్తంలో డిపాజిట్లకు లేదా ఆరో లావాదేవీకు ప్రతి రూ.1000కు రూ.2.50 ఛార్జీ లేదా ప్రతి లావాదేవీకి రూ.95 ఛార్జీ  ఏది  ఎక్కువైతే అది విధిస్తారు. 
 
 

వెబ్దునియా పై చదవండి