మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఠాగూర్

సోమవారం, 8 సెప్టెంబరు 2025 (14:13 IST)
మద్యం సేవించే అలవాటు ఉన్నవారు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సరదా కోసం మద్యం తాగుతూ తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రమాదకరమైన కాంబినేషన్ల గురించి తెలుసుకోకపోతే అనారోగ్యం బారిన పడటం ఖాయమని సూచిస్తున్నారు.
 
చాలా మంది మద్యం సేవిస్తూ బర్గర్లు, పిజ్జాల వంటి జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. అయితే, కొవ్వు అధికంగా ఉండే ఈ పదార్థాలు కాలేయంపై తీవ్రమైన భారాన్ని మోపుతాయి. ఇది దీర్ఘకాలంలో ఫ్యాటీ లివర్ వంటి ప్రమాదకర వ్యాధులకు కారణం కావచ్చు. అదేవిధంగా, కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్స్ వంటి కెఫీన్ ఉన్న పానీయాలతో ఆల్కహాల్ కలపడం వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఇది గుండె పనితీరుపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
మద్యంతో పాటు కారంగా, మసాలాతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కడుపులో మంట, అజీర్తి, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇక చాక్లెట్లు, డెజర్టులు వంటి తీపి పదార్థాలను మద్యంతో కలిపి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగిపోతాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం.
 
అంతేకాకుండా, యాంటీబయాటిక్స్ లేదా నొప్పి నివారణ మందులు వాడుతున్నప్పుడు మద్యం సేవించడం అత్యంతహానికరం. ఈ కలయిక శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాలకు దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, మద్యం సేవించే సమయంలో ఆహార ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, పుష్కలంగా నీరు తాగడం ద్వారా ఈ ప్రమాదాలను నివారించవచ్చని వారు సలహా ఇస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు