రాత్రివేళల్లో పెరుగును తినడం వల్ల ఏమవుతుందో మీకు తెలుసా?

బుధవారం, 22 మే 2019 (15:50 IST)
పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగన్నం లేనిదే భోజనం పూర్తయినట్లు కాదు. అలాంటి పెరుగుని రాత్రుల్లో తినవద్దని, ఇలా తింటే శ్వాససంబంధిత వ్యాధులు వస్తాయని కొందరు చెబుతుంటారు. ఇందులో నిజమెంత ఉందో తెలుసుకుందాం. 
 
పాలు, పెరుగు పదార్థాల్లో క్యాల్షియం, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి ఎముకలకు బలాన్ని చేకూర్చుతాయి. అందుకే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ ఈ పాల పదార్థాలను తీసుకుంటారు. ముఖ్యంగా శాకాహారులకి మిల్క్ ప్రొడెక్ట్స్ చాలా మంచిది. అయితే రాత్రి పూట పెరుగు తీసుకోవడం వల్ల జలుబు చేస్తుందని, శ్వాససంబంధింత మరియు గుండె సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతుంటారు. 
 
అందులో ఎంత మాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి వారైనా రాత్రి పూట పెరుగు తీసుకోవచ్చని, వీటిని తీసుకోవడం వల్ల అదనపు లాభాలు ఉంటాయని, చక్కగా నిద్రపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే గడ్డ పెరుగులా కాకుండా కాస్త పలుచగా మజ్జిగలా చేసుకుని తీసుకుంటే ఇంకా మంచిది. 
 
అయితే ఆ పెరుగు మరీ చల్లగా, ఫ్రిజ్‌లో పెట్టింది కాకుండా సాధారణ టెంపరేచర్‌లో ఉండేలా చూసుకోవాలి అప్పుడే మన శరీరానికి మంచి జరుగుతుంది. కాబట్టి ఏవేవో కారణాలు చెప్పి ఆరోగ్యాన్నిచ్చే పెరుగును వద్దనకండి, హ్యాపీగా తినేయండి అంటూ నిపుణులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు