7 గంటలకు పైన జంక్ ఫుడ్ వద్దు.. మితాహారమే ముద్దు..! గంటపాటు టీవీ చాలు!

బుధవారం, 6 జులై 2016 (11:57 IST)
పనిముగించుకుని ఇంటికెళ్లగానే ఏడో ఏడున్నరో అవుతుంది. ఆ సమయంలో ఏదైనా స్నాక్స్ తీసుకుని 10 గంటలకు డిన్నర్ తీసుకుంటే సరిపోతుంది. అనుకుంటే.. అనారోగ్యాలు కొనితెచ్చుకున్నట్లే. డిన్నర్‍‌ను ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 7 గంటలకు ముందు టీ, కాఫీలు ఓకే కానీ ఏడు గంటలైపోతే మాత్రం స్నాక్స్ తీసుకోవడం, టీ, కాఫీలు తాగడం, జంక్ ఫుడ్ తీసుకోవడం చాలామటుకు తగ్గించేయాలి. 8 గంటల ప్రాంతంలో లేదా 9 గంటల్లోపు డిన్నర్‌ను పూర్తి చేయాలి. 
 
రాత్రి భోజనాన్ని మితంగా తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ ఎక్కువ తీసుకుంటే పర్లేదు కానీ రాత్రి భోజనం మాత్రం తేలికగా జీర్ణమయ్యేలా.. మితంగా తీసుకోవడం మంచిది. భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమించకూడదని న్యూట్రీషన్లు సలహా ఇస్తున్నారు. ఇక సాయంత్రం నుంచే నీటిని ఎక్కువగా తాగడాన్ని తగ్గించాలి. పగటిపూట నీళ్లెక్కువ.. రాత్రిపూట సరైన మోతాదులో నీటిని సేవించాలి. 
 
ఆఫీసు నుంచి ఇంటికొచ్చాక  గంటల పాటు టీవీలకు అతుక్కుపోకూడదు. ఇది మంచి పద్దతి కాదు. టీవీ చూడొచ్చు గానీ అదే పనిగా కాకుండా ఒక గంట చూస్తే సరిపోతుంది. ఆ మిగిలిన సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడటం, పుస్తకాలు చదవటం వంటివి చేస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి