తినడానికి బతకకూడదు... బతకటానికి తినాలి... ఐతే ఏం తినాలి?

సోమవారం, 12 నవంబరు 2018 (17:00 IST)
తినడానికి బతకకూడదు... బతకటానికి తినాలి అని పూర్వం ఒక నానుడి. ఆహారం తినడం జీవించడానికి ఒక ఇంధనం అంటారు ఆధునికులు. జీవించడానికే కాదు వ్యాధి రాకుండా ఉండటానికి ఒక్కొక్కప్పుడు కొన్ని వ్యాధులు తగ్గడానికి కూడా ఆహారం అవసరం. అందుకే ప్రాణం నిలబడటానికి ఆహారం అవసరం. మనకే కాదు పశుపక్ష్యాదులు క్రిమికీటకాదులు సమస్త జీవరాశులు అన్నింటికీ ఏదో విధమైన ఆహారం వాటి జీవనానికి ఆధారం. మనకి మాత్రం ఆహారం శరీరానికి జీవించే శక్తిని, మనస్సుకు ఆలోచించే శక్తిని, జీవించే శక్తిని ఇస్తుంది.
 
పిల్లల్లో ఎదిగే శక్తిని, పెద్దవాళ్లలో యవ్వనశక్తిని, ముసలివాళ్లలో జీవనశక్తిని సమకూర్చేది ఆహారమే. అది అమృతతుల్యంగా ఉండాలని, సమతుల్యంగా ఉండాలని అటు ఆధునిక శాస్త్రం, ఇటు ఆయుర్వేదం ప్రతిపాదిస్తుంది. మన ఆహారంలో ఈ ఆరు రుచులు కలిగిన పదార్థాలు ఉండాలి. ఎందుకంటే అవి మనలో ఉండవలసిన శక్తుల హెచ్చుతగ్గులను సరిచేస్తాయి. 
 
ఒకపూట అన్నంలో కాకర కాయకూర చేదుని, క్యారెట్ కూర తీపిని, అల్లం పచ్చడి కారానికి, నిమ్మకాయ పులుపుకి, కాబేజి వగరుకి క్రమంతప్పకుండా వాడితే అది సమతుల్య ఆహారం అవుతుంది. కారం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మిరియాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, ధనియాలు జీలకర్ర వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కనుక తరచూ ఆహారంలో ఈ పదార్ధాలు ఉండేలా చూసుకోవాలి. మనం తినే ఆహారంలో కాకరకాయ, మెంతులు తప్పకుండా ఉండాలి. దీనివలన షుగర్ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంది.
 
తేనె, అన్నం, బాదం, తియ్యని పళ్లు... అన్ని రకాల ఆకుకూరలు, వెన్నతీసిన మజ్జిగ, పటికిబెల్లం కలిపిన పాలు, ములగకాడ మంచి సాత్విక ఆహారం. ఇవి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కనుక మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి సాత్విక ఆహారం తరచూ తీసుకుంటూ ఉండాలి. అప్పుడే మన మనస్సు, బుద్ధి కూడా చక్కగా పనిచేస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు