భారతీయ దంపతులకు మాత్రమే... విదేశీయలకు అనుమతి లేదు : కేంద్రం
బుధవారం, 28 అక్టోబరు 2015 (17:06 IST)
సరోగసిపై కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని ప్రకటించింది. ఈ విధానాన్ని కేవలం భారతీయ దంపతులకు మాత్రమే అనుమతిస్తామని, విదేశీయులకు అనుమతించబోమని తేల్చిచెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు బుధవారం అఫిడవిట్ సమర్పించింది.
'కమర్షియల్ సరోగసిని ప్రభుత్వం అనుమతించబోదు. భారతదేశంలో విదేశీయులకు సరోగసి సేవలు అందుబాటులో ఉండవు' అని అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. అంతేకాకుండా కమర్షియల్ సరోగసి కోసం అండం దిగుమతి చేసుకోవడంపైనా నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. అదేసమయంలో పరిశోధనల కోసం వినియోగించే వాటిపై ఆంక్షలు ఉండబోవని తెలిపింది.
అలాగే అద్దెగర్భం ద్వారా జన్మించిన వికలాంగ శిశువులను తీసుకునేందుకు నిరాకరించే దంపతులకు జరిమానా విధించాలని భావిస్తున్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్ర సర్కారు తెలిపింది. సరోగసి విధానాన్ని వ్యాపార వస్తువుగా మార్చకుండా చేసేందుకు రూపొందించిన ముసాయిదాను రాష్ట్రాలను పంపినట్టు ఆ అఫిడవిట్లో పేర్కొంది.