పచ్చి బఠానీలతో టైప్ 2 డయాబెటిస్‌కు చెక్ పెట్టవచ్చు..!

శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (10:28 IST)
డయాబెటిస్‌లో రెండు రకాలు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడేవారిలో క్లోమగ్రంథి ప‌నిచేయ‌ని కార‌ణంగా ఇన్సులిన్ విడుద‌ల కాదు. ఫలితంగా ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. ఇక టైప్ 2 డయాబెటిస్‌ను కలిగి ఉన్న వారిలో క్లోమగ్రంథి విడుద‌ల చేసే ఇన్సులిన్‌ను శ‌రీరం స‌రిగ్గా ఉప‌యోగించుకోదు. అందువ‌ల్ల ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. 
 
అయితే రెండో రకం డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు కఠినమైన జీవన విధానాన్ని పాటిస్తే దాన్ని తేలిగ్గా అదుపులో ఉంచుకోవచ్చు. అందుకోసం నిత్యం వ్యాయామం చేయ‌డం, స‌రైన పోష‌కాల‌తో కూడిన స‌మ‌తుల ఆహారాన్ని తీసుకోవ‌డం, వేళ‌కు భోజనం చేయ‌డం, నిద్ర పోవ‌డం.. వంటి అల‌వాట్ల‌ను క్రమం తప్పకుండా పాటిస్తే టైప్ 2 డ‌యాబెటిస్ త్వ‌ర‌గా అదుపులోకి వ‌స్తుంది.
 
ఈ రకం డయాబెటిస్‌తో బాధపడే వారు నిత్యం తాము తింటున్న ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి. వారు తినే ఆహారాలు ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిల‌ను పెంచ‌నివి అయి ఉండాలి. అప్పుడే షుగ‌ర్ అదుపులో ఉంటుంది. అయితే ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిల‌ను పెంచ‌ని ఆహారాల విష‌యానికి వ‌స్తే ప‌చ్చి బ‌ఠానీలు ముందు వ‌రుస‌లో ఉంటాయ‌నే చెప్ప‌వ‌చ్చు. ఇవి నిజంగా టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంతో మేలు చేస్తాయి. వీటి వ‌ల్ల షుగ‌ర్ అదుపులో ఉంటుంది.
 
టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడే వారు పచ్చిబఠానీలను తీసుకుంటే ఎంతో మంచిది. ఇవి చాలా త‌క్కువ క్యాల‌రీల‌ను ఇస్తాయి. అందువ‌ల్ల బ‌రువు పెరుగుతామ‌నే భ‌యం ఉండ‌దు. అంతేకాకుండా, వీటిలో ఉండే ఫైబర్ అంత త్వరగా ఆకలి పుట్టించదు. దీని వ‌ల్ల తిండి యావ త‌గ్గి ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటారు. ఫలితంగా బ‌రువు త‌గ్గుతారు. 
 
అలాగే ప‌చ్చి బ‌ఠానీల్లో ఉండే పొటాషియం షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపులో ఉంచుతుంది. హైబీపీ రాకుండా చూస్తుంది. ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉన్నందున శ‌రీరానికి పోష‌ణ అందుతుంది. కాబట్టి టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నిత్యం పచ్చి బఠానీలను త‌మ ఆహారంలో భాగం చేసుకుంటే షుగ‌ర్‌ను చాలా సుల‌భంగా నియంత్ర‌ణ‌లో ఉంచ‌వ‌చ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు