ఆరోగ్యానికి మేలు చేసే పొషక విలువలు కలిగిన పండ్లు అందానికి కూడా మేలు చేస్తాయి. వాతావరణంలో మార్పుల కారణంగా కొన్ని సందర్భాలలో ముఖంపై మురికీ, జిడ్డు పేరుకుపోతుంది. అలాంటి సమయంలో ఖరీదైన క్రీములు, పౌడర్లూ ఉపయోగించడం మూలంగా ఎలాంటి ఉపయోగం ఉండదు. అటువంటప్పుడు సహజంగా దొరికే పండ్లను ఉపయోగించి ఉపశమనం పొందవచ్చు.
ఆరంజ్ తొక్కలను బాగా ఎండబెట్టి, పొడిచేసుకోవాలి. ఒక స్పూన్ నారింజ పొడి తీసుకుని, దీనిలో పెరుగును కలిపి ముఖానికి ప్యాక్లా వేయాలి. 20 నిమిషాల నీళ్లతో కడిగేయాలి. దీనివల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.
పడుకునే ముందు గులాబీ నీళ్లూ, గ్లిజరిన్ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని, మర్నాడు ఉదయాన్నే కడిగేస్తే ముఖం నిగనిగలాడుతుంది.
సెనగపిండిలో గులాబీ నీళ్లు కలిపి ముఖానికి పట్టించి అరగంటయ్యాక కడిగేసినా మంచి ఫలితం కనిపిస్తుంది. పుచ్చకాయ రసం, కమలా పండు రసం, దోసకాయ గుజ్జు... దేనినైనా ముఖానికి పట్టించి మసాజ్ చేస్తే చర్మం కొత్తనిగారింపు సంతరించుకుంటుంది. గులాబీ పూల రెక్కలను మెత్తగా గ్రైండ్ చేసి ముఖానికి ప్యాక్ వేస్తే చర్మం నునుపుదనం సంతరించుకుంటుంది.