హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఠాగూర్

ఆదివారం, 6 జులై 2025 (17:22 IST)
హనీమూన్ ట్రిప్ పేరుతో ఓ కొత్త జంటకు ఓ ముఠా కుచ్చుటోపీ పెట్టింది. యూరప్‌లో తమ శోభనం రాత్రిని జరుపుకోవాలన్న యువజంట ఆశలను ఓ ట్రావెల్ ఏజెన్సీ చిదిమేసింది. వారి నుంచి ఏకంగా రూ.7.60 లక్షలు వసూలు చేసి కుచ్చటోపీ పెట్టింది. పెళ్లికి ముందు మూడు రోజుల ముందు ట్రిప్ రద్దు చేసి నిలువునా ముంచేసింది. కోల్‌కతాలోని న్యూ అలీపూర్‌కు చెందిన ఈ జంటకు ఎదురైన ఈ చేదు అనుభవం, ట్రావెల్ ఏజెన్సీల మోసాలకు అద్దం పడుతోంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమ యూరప్ హనీమూన్ ట్రిప్ కోసం సర్వే పార్క్ తూర్పు జాదవ్ పూర్ ప్రాంతంలోని ఒక ట్రావెల్ ఏజెన్సీని సంప్రదించారు. జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో పలు దఫాలుగా రూ.7.6 లక్షల మేరకు వసూలు చేశారు. ఈ మొత్తాన్ని తమ బ్యాంకు ఖాతా నుంచే ట్రావెల్ ఏజెన్సీకి బదిలీ చేశారు. 
 
తమ అనుకున్న ప్లాన్ ప్రకారం మే 14వ తేదీన వారి ప్రయాణం ప్రారంభంకావాల్సివుండగా, పెళ్ళికి కేవలం మూడు రోజులు ఉందనగా ట్రిప్ రద్దు చేస్తున్నట్టు ఏజెన్సీ నుంచి వారికి సందేశం వచ్చింది. వీసా దరఖాస్తు కోసం తాము అడిగిన విమాన టిక్కెట్లు, హోటల్ వోచర్లకు బదులుగా కన్ఫర్మ్ కానీ నకిలీ బుకింగ్స్ ఇచ్చారని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఈ మోసంపై నవ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఏజెన్సీ యజమానులపై చీటింగ్, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేశారు. డబ్బులు తిరిగి ఇస్తామని నమ్మబలికిన ఏజెన్సీ యజమానులు 45 రోజుల్లో నగదు చెల్లిస్తామని చెబుతూ జూన్ 27వ తేదీ నాటికి రూ.3.8 లక్షలు చొప్పు రెండు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారు. అయితే, ఈ ఏజెన్సీ ఇలాగే మరికొందరిని మోసం చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఇలాంటి మోసాలపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచన చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు