పండ్లు ఎప్పుడు తినాలి ? ఆహారానికి ముందా తర్వాతా?

సోమవారం, 17 జులై 2017 (07:32 IST)
పరగడుపున అంటే నిద్రలేచాక టిఫన్ లేదా భోజనం ఏదో ఒకటి తినకుండా పండ్లను ఆహారంగా స్వీకరించకూడదని చాలాకాలంగా మన పెద్దవాళ్లు చెబుతూ వచ్చారు. కడుపులో ఏదీ పడకుండా పండ్లముక్కలు ఆరగిస్తే పొట్టలో ప్రమాదకరమైన రసాయనాలకు అది దారి తీస్తుందని ఇటీవలి వరకూ వైద్య అధ్యయనాలు కూడా తెలిపాయి. ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఏదైనా పళ్లు తీసుకుంటే అది ప్రమాదకరమని పెద్దలు కూడా పిల్లలను అరిచేవారు. 
 
కానీ ఇప్పుడు పొట్టలో ఏమీ లేకుండా ఆహారంగా పండ్లు తీసుకుంటేనే మంచిదని అంటున్నారు. ఎప్పుడూ ఖాళీ కడుపుతో ఉన్నప్పుడే పండ్లు తినడం మంచిదని కొందరు వైద్య నిపుణుల సూచన. ఆహారంతో కడుపు నింపేసిన తర్వాతకంటే ఖాళీ కడుపుతో తినడంవల్ల ఎక్కువ ఫలితాలు పొందవచ్చు. శరీరంలోంచి మలినాలు తొలగించే కార్యక్రమంలో పండ్లు కీలకపాత్ర పోషిస్తాయి. 
 
ఉదాహరణకు ఏదైనా ఆహారం తీసుకుని, తర్వాత పండు తిన్నారనుకుందాం. తిన్నపండు నేరుగా కడుపులోకి అక్కడినుంచి పేగుల్లోకి వెళుతుంది. కానీ, పండు తినడానికి ముందు తీసుకున్న ఆహారం పండును పేగుల్లోకి వెళ్ళకుండా అడ్డుకుంటుంది. ఇక జీర్ణరసాల విడుదలతో ఆహారం, పండు అన్నీ కలసి యాసిడ్స్‌గా అది గ్యాస్ గా మారుతుంది. 
 
పండ్లను ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తీసుకోవడంవల్ల కేశాలరంగు వెలసిపోదు. జుట్టురాలడం తగ్గుతుంది. కళ్ళచుట్టూ నల్లటి చారికలు, ఒత్తిడి ఉండదని వైద్యులు అంటున్నారు.
 
ఆయితే ఈ అధ్యయనాలు సంపూర్ణ ఆరోగ్యవంతులకు, అనారోగ్యవంతులకు మధ్య తేడాను చెప్పడం లేదు. పైగా మాత్రలు వేసుకున్న తర్వాత పండ్లను తీసుకుంటే ఆ మాత్రల ప్రభావం బాగా తగ్గిపోతుందని కూడావైద్యులు చెబుతున్నారు. మాత్రలను మంచినీళ్లతో తప్ప మజ్జిగతో కానీ, పళ్లరసాలతో కానీ తీసుకుంటే నిష్ప్రయోజనకరమని వైద్యులు చెబుతున్న మాటలను కూడా పట్టించుకని జాగ్రత్తలు పాటిస్తే మంచిది.
 

వెబ్దునియా పై చదవండి