టెన్నిస్ తార సానియా మీర్జాకు ఇద్దరు పిల్లలు!

FileFILE
టెన్నిస్ అందాల తార సానియా మీర్జాకు పెళ్ళయిపోయింది. ఆమె విజయనగరం జిల్లా వేపాడు ప్రాంతానికి చెందిన లక్ష్మీ నారాయణను రెండు సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకుంది. వీరి రెండేళ్ళ పండంటి కాపురానికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఈ దంపతులు వ్యాపారం చేసుకుంటూ అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు.

అంతేకాదు సుమా.. సానియా మీర్జా తన పేరును కూడా మార్చుకుంది. ముస్లిం అయిన సానియా మీర్జా.. మతాంతర వివాహం చేసుకోవడంతో తన పేరును ప్రసన్న లక్ష్మీగా మార్చుకుంది. ఏమిటీ.. ఇదంతా అని అనుకుంటున్నారా? రాష్ట్ర పౌర సరఫరాల శాఖ రికార్డు పుస్తకాల్లో ఉన్న సమాచారం ఇంది.

ఇంత కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. సానియా (ప్రసన్న లక్ష్మీ)-లక్ష్మీ నారాయణ కుటుంబానికి రేషన్ కార్డును పౌరసరఫరాల శాఖ జారీ చేసింది. ఇందులో లక్ష్మీ నారాయణ భార్యగా సానియాను చూపించారు. ఆమె ఫోటోను కూడా ముద్రించారు. అయితే, పేరు మాత్రం.. సానియాకు బదులు ప్రసన్న లక్ష్మీగా పేర్కొనడం సానియాకు ఊరట కలిగించే అంశం.

ఈ సంఘటనపై సానియా కుటుంబం మాత్రం పెద్దగా స్పందించలేదు. ప్రభుత్వ యంత్రాంగంలో ఇలాంటి పొరపాట్లు సహజమేనని సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా అన్నారు. ఇలాంటి విషయాలు తమ కుమార్తె ఏకాగ్రతను దెబ్బతీయలేవని చెప్పుకొచ్చారు. కాగా, సానియాకు వచ్చే నెల పదో తేదీన బాల్యస్నేహితుడు సోహ్రాబ్ మీర్జాతో నిశ్చితార్థం జరుగనుంది.

వెబ్దునియా పై చదవండి