ఆస్ట్రేలియాలో జాతివివక్ష దాడుల పర్వం ఇప్పటికీ కొనసాగుతోంది. తాజాగా జాతివివక్ష దాడులకు ఇండోర్కు చెందిన ఓ విద్యార్థి బాధితుడయ్యాడు. మోహిత్ మంగళ్ అనే భారతీయ విద్యార్థిపై నలుగురు ఆస్ట్రేలియా యువకులు ఆదివారం రాత్రి దాడి చేశారు. సిడ్నీలోని షాపింగ్ మాల్ నుంచి తిరిగి ఇంటికి వెళుతున్న మోహిత్పై ఆస్ట్రేలియా యువకులు దాడికి పాల్పడ్డారు.
సిడ్నీలోని పలాసియా ప్రాంతంలో మోహిత్ ఉంటున్నాడు. మాల్లో సూపర్వైజర్గా పనిచేస్తున్న ఇతనిపై బీరు సీసాలతో దుండగులు దాడి చేశారు. బీరు సీసాలను మోహిత్ తలపై పగలగొట్టడంతోపాటు, బేస్బాల్ బ్యాటుతో అతడిని గాయపరిచారు. ఈ దాడి నుంచి మోహిత్ ప్రాణాలతో బయటపడ్డాడని అతని తండ్రి అనిల్ మంగళ్ తెలిపారు. తన కుమారుడికి అక్కడ శత్రువులెవరూ లేరని, జాత్యహంకారంతోనే ఈ దాడి జరిగిందని భావిస్తున్నట్లు చెప్పారు.