ఇజ్రాయేల్ సైనికులు ఈ ఏడాది ప్రారంభంలో 11 మంది పాలస్తీనా పౌరులను అకారణంగా చంపారని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇజ్రాయేల్ సేనలు గాజా ప్రాంతంలో పాలస్తీనా హమాస్ తిరుగుబాటుదారులపై యుద్ధం జరిపిన సంగతి తెలిసిందే.
ఈ యుద్ధం సందర్భంగా ఇజ్రాయేల్ సైనికులు తెలుపు జెండాలు పట్టుకొని నిరాయుధాలుగా వస్తున్న 11 మంది పాలస్తీనా పౌరుల ప్రాణాలు తీశారని మానవ హక్కుల సంస్థ తెలిపింది. అప్పటి మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు బాలలు ఉన్నారని వెల్లడించింది. ముగ్గురు సాక్షులను ఉటంకిస్తూ మానవ హక్కుల సంస్థ ఈ విషయాన్ని బహిర్గతం చేసింది.
ఇదిలా ఉంటే ఇజ్రాయేల్ ప్రభుత్వం మాత్రం హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి మానవ హక్కుల సంస్థలు అసమంజసంగా తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించింది. తాము పౌరులెవరినీ లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఇజ్రాయేల్ మిలిటరీ మాత్రం తాజా వార్తా కథనంపై స్పందించలేదు.
గాజా యుద్ధంపై వచ్చిన మానవ హక్కుల నివేదికలు ఎక్కువగా ఇజ్రాయేల్ ఉల్లంఘనలపై దృష్టిసారించగా, కొన్ని సంస్థలు పాలస్తీనా మిలిటెంట్లు కూడా యుద్ధ నిబంధనలను అతిక్రమించారని పేర్కొన్నాయి. ఇజ్రాయేల్ పౌరులపై హమాస్ మిలిటెంట్లు వేలాది రాకెట్లు ప్రయోగించాయని పేర్కొన్నాయి.