ఇరాక్‌లో బాంబు దాడులు: 20 మంది మృతి

ఇరాక్ వాయువ్య ప్రాంతంలో గురువారం జరిగిన జంట ఆత్మాహుతి దాడుల్లో 21 మంది పౌరులు మృతి చెందారని అధికారిక వర్గాలు తెలిపాయి. సింజార్ నగరంలో యువకులు గుమిగూడి ఉన్న కాఫీ షాపుపై ఈ దాడులు జరిగాయి. మైనారిటీ వర్గానికి చెందిన యువకులను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయని అధికారులు తెలిపారు.

గురువారం సాయంత్రం 5.00 గంటల సమయంలో ఆత్మాహుతి దళ సభ్యులు ఈ దాడులు జరిపారు. సింజార్ నగరం, దాని పరిసర ప్రాంతాల్లో కుర్దిష్ భాష మాట్లాడే యాజిదీ మత గ్రూపు పౌరులు ఎక్కువగా నివసిస్తున్నారు. సిరియా సరిహద్దులకు సమీపంలోని ఈ ప్రాంతంలో యాజిదీ పౌరులను లక్ష్యంగా చేసుకొని రెండేళ్ల తరువాత పెద్దఎత్తున దాడికి కుట్ర జరిగింది.

సింజార్ సమీపంలోని ఈ గ్రామంపై రెండేళ్ల క్రితం తీవ్రవాదులు పెద్దఎత్తున మారణహోమం సృష్టించారు. ఆగస్టు 14, 2007న ఖహతానియా గ్రామంలో వెంటవెంటనే నాలుగు ట్రక్కు బాంబు దాడులు పేలడంతో సుమారు 500 మంది యాజిదీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా సింజార్‌లోని అయౌబ్ కేఫ్‌పై జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 21 మంది మృతి చెందగా, 32 మంది గాయపడ్డారు. మృతుల్లో ఈజిఫ్టు పౌరుడొకరు ఉన్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. బాంబు దాడుల అనంతరం నగరంలో కర్ఫ్యూ విధించారు. మృతుల్లో ఎక్కువ మంది యాజిదీలు ఉన్నారని అధికారులు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి