ఇరాన్ మంత్రివర్గంలో ముగ్గురు మహిళలు

ఇరాన్‌లో కొత్తగా ఏర్పాటయ్యే మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు చోటు కల్పించనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు మహమౌద్ అహ్మదీనెజాద్ ఆదివారం వెల్లడించారు. గత 30 ఏళ్లలో ఇరాన్ మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పిస్తుండటం ఇదే తొలిసారి.

కొత్త మంత్రివర్గంలోకి ముగ్గురు మహిళలను తీసుకోనున్నట్లు ప్రకటన చేయడం ద్వారా అహ్మదీనెజాద్ ఇరాన్ మహిళల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. జూన్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అక్రమమార్గాల్లో విజయం సాధించారని ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అహ్మదీనెజాద్ ప్రజా మద్దతు ద్వారా తన రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవాలని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే కొత్త మంతివర్గంలో మహిళల నియామకం సంస్కరణలవాదులను సంతృప్తిపరచే అవకాశం కనిపించడం లేదు. నెజాద్ మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించిన ఇద్దరు మహిళలు తన సాంప్రదాయవర్గానికి చెందినవారే కావడం గమనార్హం.

50 ఏళ్ల వైద్యురాలు మార్జియా వాహిద్ దాస్త్‌గెర్డీని ఆరోగ్య శాఖ మంత్రిగా, 43 ఏళ్ల చట్టసభ సభ్యురాలు ఫాతెమా అజోర్లును సామాజిక భద్రత, సంక్షేమ శాఖ మంత్రిగా నియమించనున్నట్లు నెజాద్ ఆదివారం ప్రకటించారు. మరో మహిళకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని నెజాద్ ఈ సందర్భంగా వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి