గిరిజన ప్రాంతాల్లో అమెరికాకు దాడిచేసే అధికారం!

శనివారం, 4 అక్టోబరు 2008 (11:45 IST)
పాకిస్తాన్ ప్రభుత్వ సార్వభౌమాధికార నియంత్రణలో ఆ దేశ గిరిజన ప్రాంతాలు లేనందున అంతర్జాతీయ చట్టం ప్రకారం పాక్ గిరిజన ప్రాంతాల్లో దాడి చేసే అధికారం అమెరికాకు ఉందని దక్షిణాసియా నిపుణుడు చెప్పారు. అమెరికా కార్యాచరణ బృందం పాకిస్తాన్‌పై వెలువరించిన కొత్త నివేదికను శుక్రవారం విడుదల చేసిన సందర్భంగా బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌కు చెందిన దక్షిణాసియా వ్యవహారాలపై నిపుణుడు స్టీఫెన్ కోహెన్ ఈ విషయాన్ని నిర్ధారించారు.

పాక్ తన స్వంత భూభాగాలపైనే తన సార్వభౌమాధికారం కోల్పోయినందున, ప్రభుత్వ పాలన మృగ్యమైన గిరిజన ప్రాంతాల నుంచి ఏ మూడవ దేశం మీదైనా దాడి జరిగిన పక్షంలో ఆ దాడిని తిప్పికొట్టే హక్కు సంబంధిత మూడో దేశానికి ఉందని కోహెన్ స్పష్టం చేశారు. ఇక్కడ మూడవ దేశం అంటే అమెరికా, నాటో సభ్య దేశాలు అని అర్థం.

ఇలా ఒక దేశ సార్వభౌమాధికారం అమలు కాని ప్రాంతాలపై మూడో దేశం దాడి చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం కాదని కోహెన్ వ్యాఖ్యానించారు. అయితే గిరిజన ప్రాంతాల్లో పాక్ సౌర్వభౌమాధికారం తిరిగి అమలయ్యేలా చూసేందుకు అమెరికా తన మిత్ర దేశంతో కలిసి పనిచేయాలని సూచించారు.

పాక్ వాయవ్య ప్రాంతాల్లో దాగిన తాలిబాన్, అల్‌ఖైదా శక్తులపై అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు చేస్తున్న దాడి పాక్‌లో తీవ్ర ఆగ్రహావేశాలు రగిలిస్తున్న నేపథ్యంలో నాటో కూటమి దాడికి దక్షిణాసియా వ్యవహారాల నిపుణుడొకరు సమర్ధన పలకడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి