చైనా దృష్టిలో జైషే చీఫ్ మసూద్ తీవ్రవాది కాదు

భారత్‌లో తీవ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహిస్తున్న జైషే మొహమ్మద్ తీవ్రవాద సంస్థ చీఫ్ మౌలానా అజహర్‌ను తీవ్రవాదిగా ప్రకటించే ప్రతిపాదనను చైనా ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేత జైషే మొహమ్మద్‌ను తీవ్రవాద సంస్థగా, దాని అధిపతిని తీవ్రవాదిగా ప్రకటించాలని భారత్ ప్రతిపాదించింది.

ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చేందుకు చైనా మాత్రం నిరాకరించింది. జైషే మొహమ్మద్ తీవ్రవాద సంస్థపై ఆంక్షలు విధించేందుకు ఉద్దేశించిన ఈ ప్రతిపాదనను చైనా ప్రభుత్వం తోసిపుచ్చింది. భారత జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్, చైనా విదేశాంగ శాఖ కౌన్సిలర్ దైబింగూ మధ్య ఇటీవల ఈ అంశంపై చర్చలు జరిగాయి.

పాకిస్థాన్‌కు చెందిన ఈ తీవ్రవాద సంస్థపై నిషేధం విధించేందుకు సాంకేతిక కారణాల వలన చైనా మద్దతు తెలపడం లేదు. జైషే మొహమ్మద్‌పై నిషేధం విధించేందుకు తాము చేసిన ప్రతిపాదనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కారణాలు వివరించాలని భారత్ ఈ ఏడాది జులైలో చైనా ప్రభుత్వాన్ని కోరింది. దీనికి సాంకేతిక కారణాలను చైనా సాకుగా చూపినట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి