జార్జియా, రష్యా దేశాల మధ్య మరోసారి పరస్పర ఆరోపణల పర్వం మొదలైంది. రెండు దేశాలు శుక్రవారం తీవ్రస్థాయిలో ఒకదానిపై ఒకటి సంచలన ఆరోపణలు చేసుకున్నాయి. వీటితో కాకసస్ ప్రాంతంలో ఏడాది తర్వాత మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సరిగ్గా ఏడాది క్రితం దక్షిణ ఒసెటియా విషయంలో జార్జియా, రష్యాల మధ్య ఐదు రోజులపాటు యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే.
గత ఏడాది ఆగస్టు 7న ప్రారంభమైన యుద్ధంలో జార్జియాకే ఎక్కువ నష్టం జరిగింది. దక్షిణ ఒసెటియాపై జార్జియా సేనలను పట్టును విడిపించేందుకు రష్యా జోక్యం చేసుకోవడంతో వివాదం మొదలైంది. రష్యా సేనలు దక్షిణ ఒసెటియా నుంచి జార్జియా సేనలను వెనక్కుపంపాయి. అంతేకాకుండా కొన్ని రోజులు జార్జియా భూభాగంలోనే రష్యా సేనలు తిష్టవేయడం అంతర్జాతీయ ఆందోళనలు కూడా మొదలయ్యాయి.
చివరకు రష్యా సేనలు జార్జియా భూభాగాన్ని వదిలిపెట్టి వెళ్లాయి. ఆనాటి యుద్ధంలో మరణించిన సైనికులకు జార్జియా, దక్షిణ ఒసెటియా, రష్యా ప్రభుత్వ పెద్దలు శుక్రవారం నివాళులు అర్పించారు. జార్జియా అధ్యక్షుడు మిఖెయిల్ సాకాష్విలి మృత వీరులకు స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించారు.
జార్జియా మొత్తం ఒక నిమిషంపాటు మౌనం పాటించి సైనికులకు నివాళులు అర్పించింది. ఇదిలా ఉంటే రష్యా అధ్యక్షుడు ద్మిత్రీ మెద్వెదెవ్ ఈ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గత ఏడాది యుద్ధం సందర్భంగా తీసుకున్న నిర్ణయాలన్నీ తాను సొంతంగా తీసుకున్నవేనని చెప్పారు.
జార్జియాపై యుద్ధానికి రష్యా సేనలను పంపడం సరైన చర్యేనని సమర్థించుకున్నారు. ఇదిలా ఉంటే గత వారం రోజులుగా దక్షిణా ఒసెటియా పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇరువర్గాల మధ్య కవ్వింపు చర్యలు, తక్కువస్థాయిలో పరస్పర దాడులు జరిగాయి.