జుమా కేబినెట్‌లో ఆరుగురు భారతీయులు

దక్షిణాఫ్రికా కొత్త అధ్యక్షుడు జాకబ్ జుమా ఏర్పాటు చేసిన కేబినెట్‌లో ఆరుగురు భారతీయులకు చోటు కల్పించారు. కాగా, దేశ ఆర్థిక మంత్రిత్వ బాధ్యతలను జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ నేత ప్రవీణ్ గోర్డాన్‌కు అప్పగించారు.

గత ప్రభుత్వంలో కేవలం ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వారికే ఈ అవకాశం కల్పించారు. ప్రస్తుతం జుమా మాత్రం ఏకంగా ఆరుగురికి మంత్రి బాధ్యతలను అప్పగించడం గమనార్హం. 67 సంవత్సరాల జాకబ్ జుమా దక్షిణాఫ్రికా కొత్త అధ్యక్షుడిగా శనివారం ప్రమాణ స్వీకారం చేయగా, ఆదివారం ఆయన తన మంత్రివర్గాన్ని విస్తరించారు.

అంతేకాకుండా, కొత్త అధికారాలతో నేషనల్ ప్లానింగ్ కమిషన్‌ను కూడా ట్రెవర్ మాన్యూవల్‌ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. 13 సంవత్సరాల పాటు ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వహించిన ఆయన... దేశ ఆర్థిక రంగానికి చేసిన సేవల గుర్తింపుగా ప్లానింగ్ కమిషన్ ఛైర్మన్‌గా నియమించారు. అంతేకాకుండా, ప్రస్తుతం రెవెన్యూ శాఖ కమిషనర్‌గా పని చేస్తున్న భారత సంతతి నేత గోర్డాన్‌కు దేశ ఆర్థిక మంత్రి బాధ్యతలను అప్పగించడం గమనార్హం.

ఇతర మంత్రిత్వ శాఖలకు మంత్రులుగా నియమించిన భారతీయుల్లో ఇస్మాయిల్ ఇబ్రహీం (డిప్యూటీ మినిస్టప్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్), రాయ్ పడయాచ్చీ (డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్), ఎన్వర్ సుర్టీ (డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్), యూనస్ కర్రీం (డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ అండ్ ట్రెడిషనల్ అఫైర్స్), ఇబ్రహీం పటేల్ (మినిస్టర్ ఆఫ్ ఎకనామిక్స్ డెవలప్‌మెంట్)లు ఉన్నారు. కాగా, కొత్త కేబినెట్‌ను 40 మందితో అధ్యక్షుడు జాకబ్ జుమా ఏర్పాటు చేశారు.

వెబ్దునియా పై చదవండి