తీవ్రవాదులకు పాక్ ఆర్మీ, ఐఎస్ఐ అండ: బ్రిటన్ ఎంపీలు

పాకిస్థాన్ గడ్డపై వేళ్లూనుకున్న ఇస్లామిక్ తీవ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకళించి వేసేందుకు ఆ దేశ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుంటే.. ఆ దేశ ఆర్మీ, నిఘా వర్గాలు మాత్రం ఏమాత్రం సహకరించడం లేదని బ్రిటన్‌ మంత్రుల బృందం అభిప్రాయపడింది. ముఖ్యంగా, భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించేందుకు పార్ ఆర్మీ, ఐఎస్ఐ పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని ఆ బృందం అభిప్రాయపడింది.

లార్డ్ మార్క్ మల్లోచ్ బ్రౌన్ నేతృత్వంలోని బ్రిటీష్ పార్లమెంట్ ఫారిన్ అఫైర్స్ కమిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, ఆయన తన వ్యక్తిగత, కుటుంబ కారణాల దృష్ట్యా తన కమిటీ ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తం చేసిన ఆందోళనను ఒక పత్రిక ఆదివారం ప్రచురించింది.

తమ దేశానికి ప్రధాన శత్రువు తీవ్రవాదులేనని పాక్ అధ్యక్షుడు జర్దారీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తీవ్రవాదుల ఆగడాలను అణిచి వేసేందుకు దేశంలోని పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలను మొహరించినప్పటికీ.. ఆర్మీ మాత్రం భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పూర్తి మద్దతు ఇస్తోందని ఆ కమిటీ అభిప్రాయపడింది.

వెబ్దునియా పై చదవండి