మరికొద్ది నెలల్లో అమెరికా దళాలు ఇరాక్ నుంచి పూర్తిగా వైదొలగనున్నాయి. దీంతో తీవ్రవాదులు మరింతగా పెట్రేగి పోతున్నారు. సోమవారం వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న అల్లర్లలో 47 మంది మరణించారు. దేశంలోని మొత్తం 10 నగరాల్లో దాడులు, విధ్వంసకాండ కొనసాగుతున్న హింసాకాండలో 160 మంది గాయపడ్డారు. విచ్చలవిడి దాడులు అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నాయి.
దీంతో ఇరాక్ భద్రతాదళాల సమర్థతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది చివరిలోగా అమెరికా దళాలు ఇరాక్ నుంచి వైదొలగనున్న నేపథ్యంలో ఇరాక్లో తీవ్ర స్థాయిలో విధ్వంసకాండ చెలరేగడానికి కారణాలు మాత్రం తెలియడం లేదు. దీంతో ఇరాక్ మిలిటరీ దళాలకు ఇచ్చే శిక్షణా కార్యక్రమాలను మరికొంత కాలం పొడిగించాలన్న తలంపుతో అమెరికా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదిలావుండగా, దక్షిణ ఇరాక్కు చెందిన కుట్ నగరంలో సోమవారం జరిగిన రెండు వరుస బాంబుపేలుడు సంఘటనల్లో మొత్తం 34 మంది మరణించారు. అయితే దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న హింసాకాండలో సోమవారం మరణించిన వారి సంఖ్య 66కు చేరుకుంది. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కుట్ నగరం నడిబొడ్డున, రోడ్డుపక్కనే ఉంచిన బాంబు పేలింది. మరికొద్ది నిముషాల వ్యవధిలోనే సమీపంలో మరో కారుబాంబు పేలినట్టు వైద్య, భద్రతాధికార్లు తెలిపారు.