భారత్ తనను చైనా పక్షపాతిగా భావించిందని నేపాల్ మాజీ ప్రధానమంత్రి పుష్ప కుమార్ దహల్ ప్రచండ చెప్పారు. అయితే వాస్తవానికి ఈ భావన సరికాదని, వారు అలా ఆలోచించడం తప్పేనని పేర్కొన్నారు. నేపాల్లో ప్రజాస్వామ్య స్థాపన జరిగిన అనంతరం తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ప్రచండ తొమ్మిది నెలలపాటే ఈ పదవిలో ఉన్నారు.
నేపాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడంతో ఈ ఏడాది మేలో ప్రధాని పదవికి ప్రచండ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాను చైనాతోనే మెరుగైన సంబంధాలు ఉంచుకునేందుకు ఆసక్తి చూపుతానని భారత్ భావించిందని ప్రచండ తాజాగా వ్యాఖ్యానించారు. అయితే ఇది సరికాదని, తాను రెండు దేశాలతోనూ మెరుగైన సంబంధాలను కోరుకున్నానని తెలిపారు. లండన్లో బీబీసీతో మాట్లాడుతూ ప్రచండ ఈ విషయాన్ని వెల్లడించారు.