పద్మనాథన్‌పై విచారణ జరిపిస్తాం: శ్రీలంక

ఆదివారం, 9 ఆగస్టు 2009 (11:42 IST)
ఎల్టీటీఈ కొత్త చీఫ్ పద్మనాథన్‌పై విచారణ జరిపించనున్నట్టు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. గత గురువారం థాయ్‌లాండ్‌లో ఇంటర్‌పోల్ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెల్సిందే. భారత పాస్‌ పోర్టుతో సహా వివిధ దేశాల పాస్‌పోర్టులు ఉన్నప్పటికీ, అతడిపై శ్రీలంక చట్టాల ప్రకారం విచారణ జరిపిస్తామని విదేశాంగ మంత్రి రోహితా బొగుళ్ళగామా వెల్లడించారు.

ఇప్పటికే చావుదెబ్బ తిన్న ఎల్టీటీఈకి.. తాజాగా పద్మనాథన్ అరెస్టు కావడం చెప్పుకోదగిన విజయమని విదేశాంగ మంత్రి అభివర్ణించారు. పద్మనాథన్‌ని ఇక్కడికి తీసుకుని వచ్చినట్టు శ్రీలంక రక్షణ శాఖ ప్రతినిధి కెచెలియా రాంబక్వెల్లా విలేఖరులతో తెలిపారు.

ప్రస్తుతం ఆయన రక్షణ శాఖ అధికారుల కస్టడీలో ఉన్నారని చెప్పారు. పద్మనాథన్ శ్రీలంక జాతీయుడని, అందువల్ల తమ దేశ చట్టాల ప్రకారమే ఆయనపై విచారణ జరుగుతుందని శ్రీలంక అధికారులు తేల్చి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి