పాక్‌లో 11 మంది తాలిబాన్ తీవ్రవాదుల హతం

పాకిస్థాన్ భద్రతా దళాలు గురువారం 11 మంది తీవ్రవాదులను హతమార్చాయి. దేశంలోని సమస్యాత్మక మలకాండ్ డివిజన్‌లో తాలిబాన్ తీవ్రవాదులతో పాకిస్థాన్ సైన్యం పోరాడుతున్న సంగతి తెలిసిందే. తాజా పోరులో భద్రతా దళాల చేతిలో 11 మంది తాలిబాన్ తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా 12 మందిని భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు.

మలకాండ్ డివిజన్‌తోపాటు, పరిసరాల్లోని గిరిజన ప్రాంతాల్లోనూ పాకిస్థాన్ సైన్యం తాలిబాన్ తీవ్రవాదులతో పోరాడుతోంది. ఒరక్‌జై గిరిజన ప్రాంతంలో, దాని పరిసర ప్రాంతాల్లో జరిగిన పోరులో 10 మంది తీవ్రవాదులను సైన్యం హతమార్చిందని అధికారులు గురువారం వెల్లడించారు. ఒబ్లాన్, ఇతర పరిసర ప్రాంతాల్లోని తాలిబాన్ల రహస్య స్థావరాలపై కూడా సైన్యం దాడులు చేసింది.

సైన్యం దాడిలో కనీసం రెండు తీవ్రవాద రహస్య స్థావరాలు ధ్వంసమయ్యాయని అధికారులు చెప్పినట్లు పాకిస్థాన్ వార్తా ఛానళ్లు పేర్కొన్నాయి. స్వాత్‌‍లోని లులువానీ గ్రామంలో తాలిబాన్ కమాండర్ రహీమ్ గుల్‌ను పాక్ భద్రతా దళాలు అరెస్టు చేశాయి. ఇక్కడ ఓ తీవ్రవాదిని సైనికులు హతమార్చారు. స్వాత్‌లోయలోని తల్ ప్రాంతంలో నిర్వహించిన గాలింపు చర్యల్లో మరో ఐదుగురు తీవ్రవాదులను కూడా సైనికులు నిర్బంధించామని మిలిటరీ ఓ ప్రకటనలో తెలిపింది.

వెబ్దునియా పై చదవండి