పాక్ అణు కేంద్రాల భద్రతపై అమెరికా సంతృప్తి

పాకిస్థాన్ అణు కేంద్రాలపై గత రెండేళ్లలో మూడుసార్లు తాలిబాన్, అల్ ఖైదా తీవ్రవాదులు దాడులు చేశారని మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. అమెరికా అధికారిక యంత్రాంగం పాక్ భూభాగంలోని అణ్వాయుధ కేంద్రాల భద్రతపై దృష్టిసారించింది.

పాకిస్థాన్‌లోని అణ్వాయుధ గిడ్డంగులు, ఇతర అణు కేంద్రాలకు ఆ దేశ దళాలు కల్పిస్తున్న భద్రత సంతృప్తికరంగా ఉందని అమెరికా అధికారిక యంత్రాంగం శుక్రవారం పేర్కొంది. అణు కేంద్రాలకు పాకిస్థానీ దళాలు కల్పిస్తున్న భద్రతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి రాబర్ట్ గేట్స్ చెప్పారు.

తీవ్రవాద దాడులతో తీవ్ర అంతర్గత భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌లో అణ్వాయుధాల భద్రతపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అణు కేంద్రాలకు పాక్ దళాలు సంతృప్తికర స్థాయిలో భద్రత కల్పిస్తున్నాయని గేట్స్ అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే తమ దేశంలో అణ్వాయుధాలు తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లేందుకు అసలేమాత్రం అవకాశం లేదని పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది. తమ దేశంలోని అణు కేంద్రాలపై గత రెండేళ్లలో మూడుసార్లు తీవ్రవాదులు దాడి చేసినట్లు బ్రిటన్ మీడియాలో వచ్చిన వార్తలను పాక్ ప్రభుత్వం తోసిపుచ్చింది.

వెబ్దునియా పై చదవండి