పాకిస్థాన్ తాలిబాన్ గ్రూపుకు తమ కమాండర్లలో ఒకరిని చీఫ్గా నియమించేందుకు అల్ ఖైదా తీవ్రవాద సంస్థ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ తాలిబాన్ గ్రూపు చీఫ్ బైతుల్లా మెహసూద్ ఇటీవల అమెరికా డ్రోన్ జరిపిన క్షిపణి దాడిలో మృతి చెందిన సంగతి తెలిసింది. నాయకుడి మరణంతో పాక్ తాలిబాన్ గ్రూపులో తీవ్ర గందరగోళం నెలకొంది.
ఒకవైపు పాకిస్థాన్ సైన్యం, మరోవైపు అమెరికా దళాలకు లక్ష్యంగా మారడంతో పాక్ తాలిబాన్ గ్రూపు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. బైతుల్లా మెహసూద్ అనంతరం తాలిబాన్ గ్రూపు సారథ్య పగ్గాలు ఎవరు చేపట్టనున్నారనే దానిపై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో అల్ ఖైదా తీవ్రవాద సంస్థ తమ కమాండర్ ఒకరిని ఈ గ్రూపుకు అధిపతిగా నియమించడానికి సన్నాహాలు చేస్తోందని పాక్ అధికారిక యంత్రాంగం అనుమానం వ్యక్తం చేసింది.
బైతుల్లా మరణంతో తాలిబాన్ తీవ్రవాదులు వజీరిస్థాన్ ప్రాంతం నుంచి పరారవుతున్నారు. ఇదిలా ఉంటే మెహసూద్ మరణంపై కూడా భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మెహసూద్ మరణించినట్లు తమకు విశ్వసనీయ సమాచారం అందిందని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహమాన్ మాలిక్ బీబీసీ రేడియోతో చెప్పారు. అయితే బైతుల్లా మెహసూద్ బతికే ఉన్నాడని తాలిబాన్లు చెబుతున్నారు.