భారత్‌లో పెరుగుతున్న అద్దె అమ్మల వ్యాపారం!!

సోమవారం, 10 మే 2010 (15:11 IST)
ఉత్తర భారతదేశంలో అద్దెల అమ్మల వ్యాపారం నానాటికీ పెరుగుతోంది. దీంతో విదేశీ దంపతుల జంటలు వీరిని ఆశ్రయిస్తూ తమ సంతానలేమి కొరతను తీర్చుకుంటున్నారు. కరవుతో పాటు.. ఆర్థిక పరిస్థితులు, పేదరికం కారణంగా అనేక మంది మహిళలు ఈ వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

ఇలా చేయడం వల్ల తమ ఆర్థిక కష్టాలు తీరడమే కాకుండా, మరో దంపతులకు పండంటి బిడ్డను ప్రసాదించామనే తృప్తి మిగులుతోందని వారు అంటున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ ధరకు అద్దె అమ్మలు భారత్‌లో అందుబాటులో ఉన్నట్టు సిడ్నీకి చెందిన ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

పలువురు స్వదేశీయులతో పాటు విదేశీయులు వివిధ కారణాల రీత్యా సంతాన భాగ్యానికి నోచుకోలేరు. ఇలాంటి వారంతా అద్దె తల్లుల ద్వారా తమకున్న పుత్రశోకం తీర్చుకుంటున్నారు. ఇందుకోసం ఉత్తర భారతంలో పలు ఆస్పత్రులు అనధికారంగా పని చేస్తున్నట్టు సమాచారం. అద్దె అమ్మను సమకూర్చడంతో పాటు వైద్య ఖర్చులు, ప్రసవం, ఇతర న్యాయ సంబంధిత అంశాలను ఆస్పత్రుల యజమానులు చూసుకుంటాయి.

ఈ మొత్తానికి ఆస్పత్రి యాజమాన్యం రూ.20 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఒప్పందమంతా సక్రమంగా ముగిసిన తర్వాత తల్లి చేతిలో రూ.80 లేదా రూ.2 లక్షలు పెట్టి ఇంటికి పంపించి వేస్తారు. ఆ తర్వాత ఆ తల్లికి, ఆ బిడ్డకు ఎలాంటి సంబంధం లేకుండా చేస్తారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు కూడా కొంతమంది డీలర్లు ఉన్నట్టు వినికిడి. మొత్తం మీద పేదరికం, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉత్తర భారతంలో అద్దె అమ్మల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి