ముషారఫ్‌పై దర్యాప్తును ఆలస్యం చేస్తున్న పాక్

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు సంబంధించిన కేసుపై దర్యాప్తును పాకిస్థాన్ పోలీసులు ఆలస్యం చేస్తున్నారు. పాక్ ప్రభుత్వం నుంచి ఈ కేసు దర్యాప్తు విషయంలో ఎటువంటి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.

2007లో దేశంలో అత్యాయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించిన సందర్భంగా న్యాయమూర్తులను అక్రమంగా నిర్బంధించినట్లు ముషారఫ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పాక్ ప్రభుత్వం నుంచి గట్టి ఆదేశాలేవీ అందకపోవడంతో దీనికి సంబంధించిన కేసు దర్యాప్తులో పాక్ పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

ఓ స్థానిక కోర్టు ఆదేశాలపై ఇస్లామాబాద్‌లోని ఓ పోలీసు స్టేషన్‌లో గత వారం ముషారఫ్‌పై కేసు నమోదయింది. ముషారఫ్ ప్రస్తుతం లండన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ముషారఫ్ తిరిగి స్వదేశానికి వస్తే ఈ కేసులో అరెస్టు చేసే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి