రంజాన్‌లో కాల్పుల విరమణ ఉండదు: పాక్

రంజాన్ మాసంలోనూ తాలిబాన్ తీవ్రవాదులపై తమ సైనిక ఆపరేషన్ ఆగబోదని పాకిస్థాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో హింసాత్మక చర్యలకు దూరంగా ఉండేందుకే ముస్లిం దేశాల ప్రభుత్వాలు మొగ్గుచూపుతాయి.

అయితే తాలిబాన్లను పూర్తిగా అణిచివేయాలని లక్ష్యంగా పెట్టుకున్న పాకిస్థాన్ భద్రతా యంత్రాంగం పవిత్ర రంజాన్ మాసంలోనూ ఆపరేషన్ కొనసాగించాలని నిర్ణయించింది. రంజాన్ సందర్భంగా తాలిబాన్లపై కాల్పుల విరమణ ప్రకటించబోమని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహమాన్ మాలిక్ చెప్పినట్లు ఓ ఆన్‌లైన్ వార్తా సంస్థ వెల్లడించింది.

పాక్ ప్రభుత్వం తాలిబాన్లపై సైనిక చర్య విషయంలో విశ్రాంతి తీసుకోవాలనుకోవడం లేదు. తమ ప్రభుత్వానికి కాల్పుల విరమణపై ఆసక్తి లేదని మాలిక్ స్పష్టం చేశారు. గతంలో తాలిబాన్లు దీనికి సంబంధించిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు.

అందువలన తాలిబాన్ లక్షిత చర్యలను కొనసాగిస్తామని మాలిక్ తెలిపారు. ఇదిలా ఉంటే తాలిబాన్ తీవ్రవాదులు రంజాన్ మాసం సందర్భంగా కాల్పుల విరమణ ప్రకటించారు. రంజాన్ మాసం శనివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి