రాజీవ్ హత్య గురించి కేపీకి ముందే తెలుసు

భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య గురించి ఎల్టీటీఈ కొత్త అధిపతి సెల్వరాస పధ్మనాథన్‌ను కొన్ని నెలల ముందుగానే తెలుసని మీడియా కథనాలు వెల్లడించాయి. శ్రీలంకలో ప్రత్యేక దేశం కోసం సుమారు 30 ఏళ్లపాటు అంతర్యుద్ధాన్ని సాగించిన ఎల్టీటీఈ రాజీవ్ గాంధీ హత్యకు వ్యూహరచన చేసి, అమలు పరిచిన సంగతి తెలిసిందే.

అయితే రాజీవ్ హత్య గురించి కొన్ని నెలల ముందుగానే సెల్వరాస పధ్మానాథన్ ఆ సమయంలో వెల్లడించాడు. ఎల్టీటీఈ అధిపతిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సెల్వరాస పధ్మనాథన్‌ను థాయ్‌లాండ్‌లో అరెస్టు చేశారు. అతడిప్పుడు శ్రీలంక ప్రభుత్వ కస్టడీలో ఉన్నాడు. సెల్వరాస పధ్మనాథన్‌కు ఎల్టీటీఈలో కుమారన్ పధ్మనాథన్, కేపీ అనే పేర్లు కూడా ఉన్నాయి.

కేపీ పేరుతో బాగా ప్రాచుర్యం పొందిన పధ్మనాథన్ నవంబరు 1990లో తమిళనాడులో ఓ లంక తమిళుడికి ఎల్టీటీఈ త్వరలోనే భారత నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటుందని చెప్పాడు. అయితే అతను గాంధీ పేరును మాత్రం చెప్పలేదు. ఎల్టీటీఈకి చెందిన ఓ మహిళా ఆత్మాహుతి దళ సభ్యురాలు చెన్నై సమీపంలో మే 21, 1991న రాజీవ్ గాంధీని హత్య చేసిన సంగతి తెలిసిందే.

దీనికి ఆరు నెలల ముందు కేపీ భారత నాయకత్వంపై దాడి విషయాన్ని టెలిఫోన్‌లో ఓ వ్యక్తితో చెప్పాడు. ఇదిలా ఉంటే రాజీవ్ గాంధీ హత్య కేసులో కేపీ నిందితుడు కాదు. అతనికి రాజీవ్ హత్యతో ప్రత్యక్ష సంబంధాలేవీ లేవు. రాజీవ్ హత్యపై ఇప్పటికీ దర్యాప్తు కొనసాగిస్తున్న ఎండీఎంఏకి కేపీపై కొద్దిపాటి అనుమానాలు మాత్రమే ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి