రెండో భార్యతో శోభనం: బైతుల్లా ప్రాణాలు ఖతం!

ఆదివారం, 9 ఆగస్టు 2009 (13:08 IST)
పాకిస్థాన్‌లోని తాలిబాన్ తీవ్రవాద సంస్థ చీఫ్ బైతుల్లా మసూద్ తన ప్రాణాలకు తానే ముప్పు కొని తెచ్చుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న బైతుల్లా.. మామగారి ఇంటిలో భార్యతో శోభనరాత్రి గడిపాడు. ఆ సమయంలో అమెరికాకు చెందిన మానవరహిత విమానాలు అగ్నివర్షం కురిపించగా, బైతుల్లా మృతి చెందినట్టు పలు మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.

35 సంవత్సరాల బైతుల్లా మసూద్.. గత బుధవారం తన రెండో భార్యతో రాత్రి ఒంటి గంట వరకు రాసలీలల్లో నిమగ్నమైవున్నాడని ది సండే టైమ్స్ పత్రిక పేర్కొంది. ఇది అత్యంత సహసంతో కూడిన పనిగా ఆ పత్రిక పేర్కొంది. ఫలితంగా బైతుల్లా భారీ మూల్యం చెల్లించుకున్నట్టు తెలిపింది.

గతంలో కూడా ఒకసారి ఇదే తరహా దాడి నుంచి బైతుల్లా సురక్షితంగా బయటపడినట్టు మీడియా కథనం పేర్కొంది. అయితే, ఈ దఫా మాత్రం అమెరికా విమానాలు లక్ష్యాన్ని చేధించాయని తెలిపింది.

దీనిపై పాక్ అంతర్గత శాఖామంత్రి రెహ్మాన్ మాలిక్ మాట్లాడుతూ.. తమ ప్రాథమిక సమాచారం మేరకు బైతుల్లాతో పాటు.. ఆయన భార్య, ఏడుగురు అంగరక్షకులు మానవరహిత విమానాల దాడుల్లో మరణించినట్టు చెప్పారు. అయితే, మృతి ఆనవాళ్ళ కోసం వేచి చూస్తున్నట్టు మంత్రి మాలిక్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి