లష్కరే తోయిబా వ్యవస్థాపక అధ్యక్షుడు హఫీజ్ ముహమ్మద్ సయీద్, ముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాన సూత్రధాని జాకీవుర్ రెహమాన్ లఖ్వీలపై ఇంటర్పోల్ మంగళవారం రాత్రి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ముంబయి కోర్టు వీరిద్దరిపై నాన్- బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడంతో.. లఖ్వీ (48), సయీద్ (59)లపై ఇంటర్పోల్ స్పందించింది.
భారత ఆర్థిక రాజధానిలో గత ఏడాది నవంబరు 26న జరిగిన ఉగ్రవాద దాడుల్లో వీరిద్దరి ప్రమేయాన్ని పరిగణలోకి తీసుకొని రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తున్నట్లు ఇంటర్పోల్ తెలిపింది. లష్కరే తోయిబా కమాండర్ జరార్ షా, అబు అల్ ఖామాలపై కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని భారత ప్రభుత్వం ఇంటర్పోల్కు సాక్ష్యాలతోపాటు, విజ్ఞాపనపత్రాన్ని పంపింది. జరార్ షా, అబు అల్ ఖామాలపై అందజేసిన సాక్ష్యాలను తాము విశ్లేషిస్తున్నామని ఇంటర్పోల్ తెలిపింది.
ముంబయిలో ఉగ్రవాద దాడులపై విచారణ జరుపుతున్న ప్రత్యేక కోర్టు ఇటీవల లఖ్వీ, సయీద్లపై నాన్- బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. దీంతో సీబీఐ వీరిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్పోల్ను కోరింది. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలంటే ఏదైనా కోర్టు నిందితులపై నాన్- బెయిలబుల్ వారెంట్లు జారీ చేసి ఉండాల్సిన సంగతి తెలిసిందే.