సుప్రీం తీర్పుతో ఇబ్బందుల్లో పాక్ జడ్జిలు

రెండేళ్ల క్రితం ఎమర్జెన్సీ సమయంలో పర్వేజ్ ముషారఫ్ నియమించిన న్యాయమూర్తులు తాజా సుప్రీంకోర్టు తీర్పుతో ఇబ్బందుల్లో పడ్డారు. పాకిస్థాన్ సుప్రీంకోర్టు శుక్రవారం ముషారఫ్ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తూ తీసుకున్న నిర్ణయం, ఆ సమయంలో చేసిన చేసిన ఆర్డినెన్స్‌లు, న్యాయమూర్తుల తొలగింపు, వారి స్థానాల్లో జరిగిన కొత్త నియామకాలు రాజ్యంగ వ్యతిరేకమని తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

ఈ చారిత్రాత్మక తీర్పులో భాగంగా అనేక ఆర్డెనెన్స్‌ల భవితవ్యాన్ని నాలుగు నెలల్లోగా నిర్ణయించాలని దేశ పార్లమెంట్‌కు సుప్రీంకోర్టు సూచించింది. ఇదిలా ఉంటే తాజా తీర్పు కారణంగా సుమారు 110 మంది న్యాయమూర్తులు ఇబ్బందుల్లో పడనున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు, ఫెడర్ షరియత్ కోర్టుల్లో వివాదాస్పద పీసీఓ ద్వారా నియమించబడిన న్యాయమూర్తులు పదవీ విరమణ చేయడం లేదా పూర్వ స్థానాలకు వెళ్లాల్సి ఉంటుంది.

న్యాయమూర్తుల కేసులో వచ్చిన తీర్పుతో ఇబ్బందుల్లో పడిన 110 మంది న్యాయమూర్తుల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఫకీర్ ముహమ్మద్ ఖోఖర్, ఎం జావేద్ బట్టర్‌లు కూడా ఉన్నారు. ముషారఫ్ ఎమర్జెన్సీ సమయంలో సుప్రీంకోర్టులో 15 మంది న్యాయమూర్తులను, లాహోర్ హైకోర్టులో 41 మంది న్యాయమూర్తులను, సింధ్ హైకోర్టులో 27 మందిని, పెషావర్ హైకోర్టులో 10 మందిని, బలూచిస్థాన్ హైకోర్టులోని ఐదుగురు న్యాయమూర్తులు, ఇస్లామాబాద్ హైకోర్టులో ఎనిమిది మందిని, ఫెడరల్ షరియత్ కోర్టుల్లో నలుగురిని నియమించారు.

వెబ్దునియా పై చదవండి