అమెరికాలో స్వైన్ ఫ్లూ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబసభ్యులు న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టులో దావా వేశారు. ప్రభుత్వం నుంచి 40 మిలియన్ డాలర్ల నష్ట పరిహారాన్ని డిమాండ్ చేయడం ఈ దావా ఉద్దేశంగా తెలుస్తోంది. బుధవారం ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. అమెరికాలో తొలి స్వైన్ ఫ్లూ మరణం న్యూయార్క్లో నమోదయింది.
న్యూయార్క్లోని క్వీన్స్ పాఠశాలలో అసిస్టెంట్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న మిచ్ వీనెర్ మేలో స్వైన్ ఫ్లూ కారణంగా మరణించారు. అంతకుముందు వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు న్యూయార్క్ నగరంలోని అనేక పాఠశాలలను స్థానిక ప్రభుత్వం మూసివేసింది. ముఖ్యంగా విద్యార్థులకు ఎక్కువగా స్వైన్ ఫ్లూ వ్యాధి వ్యాపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే మరిన్ని పాఠశాలలను అధికారిక యంత్రాంగం మూసివేయకపోవడం వలనే తన భర్త మరణించాడని వీనెర్స్ భార్య, ఆయన ముగ్గురు పిల్లలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మృతుడి కుటుంబసభ్యులు న్యూయార్క్ కోర్టులో దావా వేశారు.
ఈ దావా ద్వారా న్యూయార్క్ స్థానిక ప్రభుత్వాన్ని, దాని ఆరోగ్య, విద్యా విభాగాలను కోర్టులో నిలబెట్టాలని వారు భావిస్తున్నారు. నగర యంత్రాంగం మరిన్ని పాఠశాలలు మూసివేసే దిశగా సత్వర చర్యలు తీసుకొని ఉండాల్సింది. స్థానిక ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే వీనర్స్ మృతి చెందాడని పిటిషన్లో మృతుడు కుటుంబసభ్యులు పేర్కొన్నట్లు సీబీఎస్ టెలివిజన్ నెట్వర్క్ వెల్లడించింది.