హిందూ, ఫసిఫిక్ మహాసముద్రాల్లో కొన్ని గంటల క్రితం రెండు భూకంపాలు సంభవించాయి. హిందూ మహాసముద్రంలో భూకంపం కారణంగా మొదట అధికారిక యంత్రాంగం దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలకు సునామీ హెచ్చరిక జారీ చేసింది. అయితే ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని నిర్ధారించుకున్న తరువాత సునామీ హెచ్చరికను ఉపసంహరించుకున్నారు.
హిందూ మహాసముద్రంలో సంభవించిన మొదటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదయింది. జపాన్ తీరంలోని ఫసిఫిక్ మహాసముద్రంలో సంభవించిన రెండో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదయినట్లు డెన్వెర్లోని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. హిందూ మహాసముద్రంలో అండమాన్ ద్వీపాలకు ఉత్తరంగా 262 కిలోమీటర్ల దూరంలో మొదటి భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
మంగళవారం ఉదయం సంభవించిన ఈ భూకంపం కారణంగా ఫసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం బంగ్లాదేశ్, భారత్, ఇండోనేషియా, మయన్మార్, థాయ్లాండ్ దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే కొన్ని గంటల తరువాత దీనిని రద్దు చేశారు. ఫసిఫిక్ మహాసముద్రంలో సంభవించిన రెండు భూకంపం కేంద్రాన్ని టోక్యోకు నైరుతీ దిశగా 170 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. దీని కారణంగా సునామీ హెచ్చరికలేవీ జారీ చేయలేదు.