26/11 దాడిపై సీరియస్‌గా స్పందించని భారత్: పాక్

గత యేడాది నవంబరు 26వ తేదీన ముంబైపై జరిగిన దాడుల విచారణ పట్ల భారత్ సీరియస్‌గా ఉన్నట్టు కనిపించడం లేదని పాకిస్థాన్ ఆరోపించింది. ఈ వ్యవహారానికి సంబంధించి భారత్ సమర్పించిన ఆధారాలు అసంపూర్తిగా ఉన్నాయని పాకిస్థాన్ అంతర్గత భద్రతా శాఖామంత్రి రెహ్మాన్ మాలిక్ ఆరోపించారు. ఆయన శనివారం ఎక్స్‌ప్రెస్ 24/7 అనే టీవీ ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఇందులో భారత్ వైఖరిని మంత్రి తప్పుబట్టారు. 26/11 దాడులకు సంబంధించి ఇప్పటి వరకు నాలుగు దఫాలుగా ఆధారాలు సమర్పించిందన్నారు. దోషులను అరెస్టు చేసి చట్టం ముందు నిలబెట్టి శిక్షించేందుకు వీలుగా సరైన సాక్ష్యాధారాలను సమర్పించడంలో ఆలక్ష్యం చూపుతోందని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు భారత్ అందించిన సమాచారం సరిపోలేదని ఆయన స్పష్టం చేశారు.

అంతేకాకుండా, గత నెలలో పాక్ కోరిన కొంత సమాచారాన్ని కూడా భారత్ అందించలేదని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా 26/11 మారణహోమంపై దర్యాప్తు జరిపేందుకు పాక్ సీరియస్‌గానే ఉందని, అయితే, అవతలి (భారత్)వైపు నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదన్నారు. సరైన సమాచారం ఇవ్వకుండా భారత్ పక్కదారి పట్టిస్తోందని మంత్రి ఆరోపించారు. ముంబై దాడుల్లో సంబంధం ఉన్న 13 మందిని అరెస్టు చేసేందుకు పాకిస్థాన్ ఇంటర్‌పోల్‌ను కోరినట్టు ఆయన గుర్తు చేశారు.

వెబ్దునియా పై చదవండి