యుద్ధం ప్రకటిస్తే ఉత్తర కొరియా భస్మమై పోతుంది : అమెరికా

బుధవారం, 27 సెప్టెంబరు 2017 (07:13 IST)
అమెరికా తమ మీద యుద్ధాన్ని ప్రకటించిందన్న ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రీ యాంగ్ హో ఆరోపణను వైట్‌హౌస్ కార్యదర్శి సారా శాండర్స్ తీవ్రంగా ఖండించారు. మేం ఉత్తర కొరియాపై యుద్ధం ప్రకటించలేదు. అటువంటి ఆలోచనే లేదు. ఒకవేళ యుద్ధమంటూ ప్రకటిస్తే ఉత్తర కొరియా భస్మమైపోతుందని హెచ్చరించారు. 
 
ఈ విషయంలో ఉత్తర కొరియా మంత్రి రీ యాంగ్ హో ప్రకటన అసంబద్ధం అని శాండర్స్ మంగళవారం మీడియాతో అన్నారు. అంతర్జాతీయ సముద్ర జలాలపై తిరిగే ఒక బాంబర్‌ను కూల్చేస్తామని మరో దేశం పేర్కొనడం సరికాదు. ఉత్తర కొరియా అణు కార్యక్రమాలను నిరోధించడమే మా లక్ష్యం అని శాండర్స్ స్పష్టం చేశారు. 
 
అంతకుముందు... అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తమ దేశంపై యుద్ధం ప్రకటించాడని ఉత్తరకొరియా విదేశాంగశాఖ మంత్రి రియాంగ్‌హో ఆరోపించిన విషయం తెల్సిందే. ఈ యుద్ధ ప్రకటన ద్వారా అమెరికా బాంబర్లను ఏ క్షణాన్నైనా కూల్చే అవకాశాన్ని ట్రంప్ అన్యాపదేశంగా ఉత్తర కొరియాకు ఇచ్చినట్లయ్యిందని రియాంగ్ హో అన్నారు. ఈ విషయాన్ని ప్రపంచదేశాలన్నీ గమనించాలి. ముందుగా యుద్ధ ప్రకటన చేసింది ట్రంప్. మేము కాదు అని ఆయన పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి