ఆ జర్నలిస్టు దేశం విడిచి వెళ్లకూడదు... షరీఫ్ సర్కారు ఆదేశం .. ఒక్కటైనా పాక్ మీడియా

గురువారం, 13 అక్టోబరు 2016 (08:59 IST)
సిరిల్ ఆల్మైదా.. పాకిస్థాన్‌లో సంచలన కథనాలు రాసే జర్నలిస్టుల్లో ఒకరు. తాజాగా ఆయన రాసిన ఓ కథనం.. పాకిస్థాన్ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించింది. దీంతో ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్.. అతనిపై కన్నెర్రజేశారు. సిరిల్ ఆల్మైదా దేశం విడిచి వెళ్లొద్దంటూ ఆంక్షలు విధించాడు. దీనిపై పాక్ మీడియా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిరిల్‌కు అండగా ఉంటామని ప్రకటించింది. ఇది షరీఫ్‌కు మరో తలనొప్పి తెచ్చిపెట్టింది. 
 
ఇండోపాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సిరిల్ ఆల్మైదా ఒక కథనం రాశాడు. దాని సారాంశం... ప్రభుత్వానికి, ఆర్మీకి చెడిందంటూ పేర్కొనడమే. ఈ కథనంపై అక్కసు వెళ్లగక్కిన ప్రభుత్వం అతడిపై నిప్పులు చెరిగింది. అది వండివార్చిన కథనమని, వాస్తవ విరుద్ధమని పేర్కొంది. 
 
ప్రభుత్వానికి, ఆర్మీ మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయని నమ్మించే ప్రయత్నం చేసేంది. జర్నలిజం విలువలకు తిలోదకాలు ఇచ్చిన వార్తను ప్రచురించాని పేర్కొంది. వార్త రాసిన, దానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. అందులో భాగంగా వార్త రాసిన అల్మైదా దేశం విడిచి వెళ్లరాదని హుకుం జారీ చేసింది. 
 
తమ జర్నలిస్టుపై నిషేధం విధించడంపై స్పందించిన డాన్ పత్రిక.. తాను ప్రచురించిన కథనాన్ని సమర్థించుకుంది. అన్ని రకాలుగా పూర్తిగా పరిశీలించిన తర్వాతే వార్తను ప్రచురించినట్టు తెలిపింది. ఆల్మైదాకు అండగా ఉంటామని పేర్కొంది. అలాగే, 'ది నేషన్' ఆల్మైదాకు అండగా నిలిచింది. 
 
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తను ప్రచురించారన్న నెపంతో జర్నలిస్టును క్రిమినల్‌లా చూడడం తగదని పేర్కొంది. ఒకవేళ ఆయన రాసింది 'ఫ్యాబ్రికేటెడ్' కథనమే అయితే పార్లమెంటు సభ్యులు నిషేధిత ఉగ్రవాద సంస్థల నేతలైన మసూద్ అజర్, హఫీజ్ సయాద్‌లను ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించింది. ఈ హఠాత్ పరిణామాలను షరీఫ్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. 

వెబ్దునియా పై చదవండి