తల బిరుసు ముఠాతో కలిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు : ఆసీస్‌కు చైనా వార్నింగ్

ఆదివారం, 8 నవంబరు 2020 (17:36 IST)
ఆస్ట్రేలియాకు డ్రాగన్ కంట్రీ చైనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. తల బిరుసు మూఠాతో కలిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని చైనా హెచ్చరిక చేసింది. 'వాణిజ్యపరమైన బాధ'ను అనుభవించక తప్పదని వార్నింగ్ ఇచ్చింది. ఆసీస్‌కు చైనా ఇలా వార్నింగ్ ఇవ్వడానికి కారణం లేకపోలేదు. 
 
బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో భారత్, అమెరికా, జపాన్ దేశాలు సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. వీటితో ఆస్ట్రేలియా కూడా జత కలిసింది. దీన్ని చైనా జీర్ణించుకోలేకపోతోంది. ఈ నాలుగు దేశాలు తనకు చెక్ పెట్టేందుకే సముద్రంలో విన్యాసాలు చేస్తున్నాయని గ్రహించిన చైనా తన అధికార పత్రికలో అక్కసు వెళ్లగక్కింది. 
 
అమెరికా నేతృత్వంలో సముద్ర విన్యాసాలు చేస్తున్న 'తలబిరుసు ముఠా'తో కలిస్తే ఆస్ట్రేలియా 'వాణిజ్యపరమైన బాధ'ను అనుభవించక తప్పదని హెచ్చరించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎంతో దూకుడుగా యుద్ధ నౌకలను చైనా ముంగిట్లోకి పంపిందంటూ తిట్టిపోసింది.
 
'అమెరికా పథకాల్లో పాలుపంచుకుంటున్నందుకు లాభమేమీ దక్కదన్న విషయాన్ని ఆస్ట్రేలియా అధినాయకత్వం గ్రహించాలి. మలబార్ విన్యాసాలకు బదులుగా అమెరికా నుంచి ఎలాంటి ప్రతిఫలం రాదన్న విషయాన్ని గుర్తించాలి. మలబార్ విన్యాసాల్లో పాల్గొనాలన్న తప్పుడు నిర్ణయం తీసుకున్నందుకు ఆస్ట్రేలియా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది' అని చైనా అధికార పత్రిక ఘాటు వ్యాఖ్యలు చేసింది.
 
గతంలో చైనా, ఆస్ట్రేలియా దేశాల మధ్య సంబంధాలు సజావుగానే ఉండేవి. అయితే, కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తికి కారణమెవరు? అంటూ ఆస్ట్రేలియా విచారణకు ఆదేశించినప్పటి నుంచి చైనా కోపంగా ఉంటోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు