3 వేల కార్లతో సముద్రంలో మునిగిపోయిన కార్గో నౌక!!

ఠాగూర్

బుధవారం, 25 జూన్ 2025 (16:27 IST)
పసిఫిక్ మహా సముద్రంలో కార్గో నౌక ఒకటి మునిగిపోయింది. మూడు వేల కార్లతో వెళుతున్న ఈ నౌకలో వారం రోజుల క్రితమే అగ్నిప్రమాదం సంభవించింది. ఈ కారణంగానే భారీ నౌక నీటిలో మునిగిపోయివుండొచ్చని భావిస్తున్నారు. 
 
ఈ రవాణా నౌకలో మొత్తం 3 వేల కార్లు ఉండగా, అందులో 800 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. అలస్కాలోని అలూటియన్ దీవుల వద్ద తాజాగా ఈ నౌక మునిగిపోయిందని లండన్‌కు చెందిన ఓ నౌక నిర్వహణ సంస్థ జోడియాక్ మారిటైమ్ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
అయితే, ఈ ఘటన తర్వాత అంత పెద్దగా కాలుష్యం వెలువడలేదని, యూఎస్ కోర్ట్‌గార్డ్ ప్రతినిధి తెలిపారు. కాలుష్య నియంత్రణ పరికరాలు కలిగిన రెండు సాల్వేజ్ టగ్‌లను అక్కడ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 
 
జూన్ 3 తేదీన ఈ రవాణా నౌకలో అగ్నిప్రమాదం జరిగిందని తమకు సమాచారం వచ్చిందని యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి తెలిపారు. ప్రమాదం సమయంలో నౌకలో 22 మంది సిబ్బంది ఉండగా, వారందరూ లైఫ్‌బోట్ ద్వారా బయటపడి ప్రాణాలు కాపాడుకున్నట్టు తెలిపారు. 
 
ఆ సమంయలో  సమీపంలోని మర్చంట్ మెరైన్ అనే మరో నౌక వారిని రక్షించినట్టు తెలిపారు. ఓడకు వెనుక భాగంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు లోడింగ్ చేసివుండటంతో పెద్దమొత్తంలో పొగలు కనిపించాయని ప్రమాద సమయంలో కోస్ట్ గార్డు అధికారులు, నౌకా సంస్థ అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు