భారత అనుకూల మిత్రదేశాలకు డ్రాగన్ కంట్రీ ఎర?

ఆదివారం, 21 జూన్ 2020 (12:25 IST)
చైనా మరో కుటిల దౌత్యనీతికి తెరతీసింది. భారత్‌కు అనుకూలంగా ఉండే మిత్ర దేశాలను తనవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులోభాగంగా, బంగ్లాదేశ్‌ను బుట్టలో వేసుకునేందుకు అనేక రకాలైన తాయిలాలను ప్రకటించింది. 
 
భార‌త్‌కు చిర‌కాల‌ మిత్ర దేశమైన బంగ్లాదేశ్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్న దాదాపు 5,161 ర‌కాల‌ ఉత్పత్తులపై 97 శాతం సుంకాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్‌ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. భారత్ - చైనా దేశాల మధ్య లడాఖ్‌లో సరిహద్దు ఘర్షణలు జరిగిన మరుసటి రోజే చైనా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 
 
చైనా చర్యలపై అంతర్జాతీయ నిపుణులు స్పందిస్తూ, భారత్‌తో సత్సంబంధాలు కలిగిన దేశాలను దూరం చేసి త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డానికే చైనా ఈ తరహా ఎత్తుగడలు వేస్తోందని అభిప్రాయపడ్డారు. 
 
ఇటీవ‌ల నేపాల్ సైతం భారత్‌లోని మూడు భూభాగాలను తమవిగా పేర్కొంటూ కొత్త మ్యాప్‌ను రూపొందించింది. ఆ మ్యాప్‌కు నేపాల్ పార్లమెంట్ ఆమోద‌ముద్ర కూడా వేసింది. దీని వెనుక కూడా చైనా హస్తం ఉన్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఇపుడు బంగ్లాదేశ్‌కు అనేక రకాల తాయిలాలు ప్రకటించి తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు