కరోనా వ్యాక్సిన్‌ దుష్పరిణామాలకు నష్టపరిహారం : డబ్ల్యుహెచ్‌ఒ

మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (14:46 IST)
అంతర్జాతీయ కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం ద్వారా 'కొవాక్స్‌' ను ప్రపంచ ఆరోగ్య సంస్థ 92 పేద దేశాలకు వ్యాక్సిన్‌ ఉచితంగా పంపిణీ చేస్తోంది. అయితే ఈ వ్యాక్సిన్‌ కారణంగా దుష్పరిణామాలు తలెత్తితే నోఫాల్ట్‌ పరిహార ప్రణాళిక కింద పరిహారం చెల్లించేందుకు డబ్ల్యుహెచ్‌ఒ అంగీకరించింది.

ఇది కొవిడ్‌కు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో అమలు కానున్న ఏకైక నష్ట పరిహార కార్యక్రమం, అలాగే అలాగే అంతర్జాతీయ స్థాయిలో పనిచేసే మొదటి, ఏకైక వ్యాక్సిన్‌ దుష్పరిణామాల పరిహార యంత్రాంగం ఇదేనని డబ్ల్యుహెచ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులందరికీ వేగవంతమైన, సముచితమైన, ఆరోగ్యవంతమైన, పారదర్శకమైన న్యాయం అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని పేర్కొంది.

భారత్‌తో సహా పలు ఆఫ్రికా, ఆగేయాసియా దేశాలు కొవాక్స్‌ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి. ఈ పథకం ద్వారా టీకాలను ఉచితంగానే అందిస్తున్నప్పటికీ.. వాటి వల్ల కలిగే దుష్పరిణామాలకు ఎవరు భాద్యులంటూ పలు విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు ఈ ఫిర్యాదులను ఏ విధంగా పరిష్కరించాలనేది ఆయా ప్రభుత్వాలకు సవాలుగా మారింది.

ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఈ కార్యక్రమాన్ని అనుసరించి కొవాక్స్‌ పథకం కింద టీకా తీసుకున్న వారిలో ఎక్కువ దుష్పరిణామాలు తలెత్తితే న్యాయస్థానం, ఫిర్యాదులు తదితర విధానాలతో నిమిత్తం లేకుండా అర్హులకు వెంటనే పరిహారం చెల్లిస్తారు.

కరోనా వ్యాక్సిన్‌ పరిహారానికి పరిహారానికి సంబంధించిన దరఖాస్తులు మార్చి 31 నుంచి అందుబాటులో ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాగా, ఈ వెసులుబాటు జూన్‌ 30, 2022 వరకు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు